నిజానికి 2024లో సార్వత్రిక ఎన్నికలనాటికి ఉత్తరాది రాష్ట్రాల్లో తమ బలం కొంత తగ్గినా దక్షిణాది రాష్ట్రాల్లో వీలైనంత బలపడి ఆ లోటు పూడ్చుకోవాలన్నది ఇప్పటిదాకా బీజేపీ అధిష్ఠానం వ్యూహంగా ఉంది. అటు తూర్పున బెంగాల్నూ గుప్పిట పట్టాలనుకుంది. కానీ అక్కడ బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ బీజేపీ జోరుకు అడ్డుకట్ట వేసిన విషయం తెలిసిందే. అందుకే దీదీ ప్రభుత్వంపై బీజేపీ కక్ష గట్టినట్టు వ్యవహరిస్తోంది. ఇదే సమయంలో ఉత్తర ప్రదేశ్ స్థానిక ఎన్నికల ఫలితాలు బీజేపీ అగ్రనాయకుల భయాలను నిజం చేశాయి. అవి బీజేపీకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. అంతేకాదు.. మోదీ మ్యాజిక్ ప్రజలపై ఇక పని చేయదని కూడా ఇవి చాటి చెప్పాయి. కొన్ని నెలలుగా ఢిల్లీ సరిహద్దులను ముట్టడించి రైతులు చేస్తున్న ఉద్యమంపై బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి, వలస కూలీల వెతలు, కోవిడ్ నియంత్రణలో వైఫల్యం దేశవ్యాప్తంగా రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజల్లోనూ మోదీ ప్రతిష్ఠను మసకబార్చాయి. అంతేకాదు ఆర్ఎస్ఎస్ వర్గాల్లో కూడా మోదీ విధానాలపై వ్యతిరేకత నెలకొందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో దేశరాజకీయాల్లో తన పట్టు నిలుపుకోవడానికి బీజేపీ ఎలాంటి వ్యూహాలను అనుసరించనున్నదనే విషయంపై రాజకీయ విశ్లేషణలు సాగుతున్నాయి. ఇప్పటిదాకా అజేయులమని భావించిన మోదీషా ద్వయం అటు ప్రభుత్వం లోనూ ఇటు పార్టీలోనూ అంతా తామే అన్నట్టుగా వ్యవహరించారు. ఇప్పుడు వారికి ఎదురుగాలులు వీస్తుండటంతో ఇకపై వారి వైఖరి మార్చుకోక తప్పదని ఆ పార్టీలోనే అంతర్గతంగా చర్చ నడుస్తోంది.. ఇప్పటిదాకా పొత్తులు పెట్టుకున్న పార్టీలనే కబళించే సరికొత్త వ్యూహాన్నిఅనుసరిస్తూ వచ్చిన బీజేపీ మళ్లీ ఆ ప్రాంతీయ పార్టీలతో సామరస్య వైఖరి కోసం దిగిరాక తప్పకపోవచ్చు. అయితే మోదీ తత్వం తెలిసినవారికి ఇది ఎంతవరకు సాధ్యమనే అనుమానాలు రావడం సహజమే. అంతేకాదు.. మోదీషా ఆధ్వర్యంలోని బీజేపీని ఇతర పార్టీలు ఎంతవరకు విశ్వసిస్తాయనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.