అమెరికాలో పెళ్లి చేసుకుంటే మరోచోట భోజనాలు ఎందుకు పెడతారు.. అలా ఎక్కడైనా జరుగుతుందా అంటారు ఈ విషయం చెబితే ఎవరైనా.. కానీ ఇక్కడ ఇలాంటిదే జరిగింది. అమెరికాలో పెళ్లి జరిగితే ఏకంగా తెలంగాణలోని బైంసా జిల్లాలో భోజనాలు ఏర్పాటు చేశారు. అందరికీ వివిధ రకాల భోజనాలు ఏర్పాటు చేసి పెళ్లిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అదేంటి అలా ఎందుకు అని ఆశ్చర్య పోతున్నారు కదా.. అమెరికాలో పెళ్లి చేసుకుంది ఎవరో కాదు బైంసా జిల్లాకు చెందిన దంపతుల కూతురే. బైంసా జిల్లాకు చెందిన ప్రకాష్, జ్యోతి దంపతుల కూతురు మహారాష్ట్రలోని కిని గ్రామానికి చెందిన ఓ యువకుడుకి 2 సంవత్సరాల క్రితం నిశ్చితార్థం జరిగింది.
అంతలోనే వీరిద్దరూ ఉద్యోగం నిమిత్తం అమెరికాకు వెళ్లిపోయారు. ఇక నిశ్చితార్థం జరిగిన తేదీ నాడే మళ్లీ భారత్ తిరిగి వచ్చి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ కారణంగా కుదరలేదు. ఇక భారత్కు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఇటీవల ఇద్దరు యువతీ యువకులు అమెరికాలోనే వివాహం చేసుకున్నారు. ఇక ఈ వివాహాన్ని ప్రొజెక్టర్ సహాయంతో బంధు మిత్రులందరూ వీక్షించారు. వివాహం ముగిసిన తర్వాత అతిధులకు యువతి తల్లిదండ్రులు విందు భోజనం కూడా ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి విచ్చేసిన బంధుమిత్రులు అందరూ కూడా అమెరికాలో జరిగిన పెళ్లి కి ఆశీర్వచనాలు తెలుపుతూ విందు భోజనాలు చేశారు.