బీజేపీ నాయకులు చెబుతున్న దాని ప్రకారం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితర నేతలు రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే తొలిదశలో బీజేపీ యువ ఎంపీ తేజస్వి యాదవ్ హైదరాబాద్కు వచ్చి ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత పెద్దలు రానున్నారు. ఎన్నికల ప్రచారానికి కేవలం నవంబర్ 29 వరకే గడువు ఉంది. అంటే కేవలం ఇంకా 5 రోజులే ఉన్నాయి. ఈ క్రమంలో బీజేపీ పెద్దలు వరుసగా హైదరాబాద్కు క్యూ కట్టనున్నారు. అందరు నేతలు ఒకే రోజు కాకుండా, రోజుకో నేత ప్రచారానికి రానున్నట్టు తెలిసింది. చివరి ఘట్టంలో అమిత్ షా ప్రచారానికి రానున్నట్టు సమాచారం. ఎన్నికలకు రెండు రోజుల ముందు అమిత్ షా హైదరాబాద్లో పర్యటించి ప్రచారం చేస్తే ఆ జోష్ హైలో ఉంటుందని, అది ఎన్నికలకు పనికొస్తుందని నేతలు అంచనా వేస్తున్నారు.
గ్రేటర్లో ఇప్పటికే రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటాపోటీ ప్రచారం సెగలు పుట్టిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ను వెనక్కి నెట్టి గ్రేటర్ పోటీలో బీజేపీ రేసులోకి వచ్చింది. టీఆర్ఎస్ నేతలకు ధీటుగా ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. గ్రేటర్ పీఠమే లక్ష్యంగా కమలదళం పావులు కదుపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నేతలందరినీ మోహరించి భాగ్యనగర్ బస్తీల్లో జోరు పెంచుతోంది. అధికార పార్టీ నుంచి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తుండగా.. గల్లీల్లో మంత్రులు తిష్టవేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం సోమవారం జరిగిన మీడియా సమావేశం ద్వారా హైదరాబాద్ వాసులపై వరాల జల్లు కురిపించారు.