తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు ఎవరు ? ఉంటారు... ఎప్పుడు ఎవరు ? అవుట్ అవుతారు అన్నది ఆ పార్టీ నేతలకే క్లారిటీ లేదు. నిన్నటివరకు పార్టీకి ఎంతో నమ్మినబంటుగా ఉన్నవారు సైతం రేపు కండువా మార్చేస్తున్నారు. గోదావరి జిల్లాలకు చెందిన కీలక నేత బొడ్డు భాస్కర రామారావు టిడిపిని వీడి వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. చాలా మంది సీనియర్లు... మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా బిజెపిలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సైతం టిడిపికి టాటా చెప్పేసి బీజేపీలో చేరతారన్న ప్రచారం ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన టీడీపీలో ఉంటే ఆయన వ్యాపారాలకు ఇబ్బంది కలుగుతుందని... ఈ నేపథ్యంలోనే ఆయన బిజెపిలో చేరుతున్నట్లు కొద్దిరోజులుగా టాక్ వినిపిస్తోంది. దీనిపై స్పందించిన ఆయన బిజెపిలో చేరాలని టిడిపిలో ఉంటానని క్లారిటీ ఇచ్చారు.
అయినా సోషల్ మీడియాలో పుల్లారావు పార్టీ మార్పుపై ప్రచారం మాత్రం ఆగడం లేదు. తాజాగా దీనిపై మరోసారి గుంటూరు జిల్లా టిడిపి నేతలు పుల్లారావు తరఫున క్లారిటీ ఇచ్చారు. ఈ ఊహాగానాలు మరోసారి రావడం వెనక చాలా కారణం ఉంది. ఇటీవల ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు చిలకలూరిపేటకు వచ్చారు. శుక్రవారం చిలకలూరిపేటలో చంద్రబాబునాయుడుకు స్వాగత కార్యక్రమంలో పుల్లారావు పాల్గొనలేదు. దీంతో మరోసారి అనుమానాలు ముసురుకున్నాయి.
ఈ విషయంపై జిల్లా టీడీపీ నేతలు మాట్లాడుతూ చంద్రబాబు పర్యటనకు అందుబాటులో లేకనే ప్రత్తిపాటి హాజరుకాలేకపోయారన్నారు. ఈ విషయాన్ని సాకుగా తీసుకుని కొందరు ఆయన బీజేపీలో చేరుతున్నారని దుష్ప్రచారం చేయడం తగదని తెలిపారు. ప్రత్తిపాటి ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీని వీడరని, నియోజకవర్గంలో టీడీపీని మరింత బలోపేతం చేస్తారని అన్నారు. వైసీపీ దాడులను తిప్పి కొట్టేందుకు తాము కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నామని ఆయన వివరించారు.