కీర్తి .. రెండు మూడు రోజులుగా టీవీ చానళ్లలో ఈ అమ్మాయి చేసిన ఘాతుకం గురించి బాగా వినిపిస్తోంది. లవర్ తో కలిసి ఈ అమ్మాయి ఏకంగా తల్లినే చంపేసింది. మొదట ఒకతడిని ప్రేమించి.. అతడి కారణంగా గర్భం దాల్చింది. అది పొగొట్టుకునేందుకు మరో వ్యక్తి సాయం తీసుకుని చివరకు అతడితోనూ ప్రేమ నడిపింది. ఇవన్నీ వద్దన్నందుకు తల్లినే చంపింది.


తండ్రి శ్రీనివాస్ రెడ్డి.. ఓ లారీ డ్రైవర్. తల్లి నీరజ గృహిణి. వీరికి ఒక్కతే కూతురు కీర్తి. తల్లిదండ్రులు అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచారు. అమెరికాలో స్థిరపడేలా చూడాలని కలలు కన్నారు. అయితే, సామాజిక పరిస్థితుల ప్రభావంతో ఆ అమ్మాయి డిగ్రీ ఫస్టియర్లోనే ప్రేమ వ్యవహారం నడిపితే గొడవలయ్యాయి. ఇపుడు సెకండియర్ లో మరో అబ్బాయితో ప్రేమ పేరుతో తిరుగుతోంది ఆ కూతురు.


ఈ విషయం బయటకొస్తే తమ కుటుంబం పరువు బజారున పడుతుందని ఆలోచించి, తప్పు చేయవద్దని కూతురిని మందలించి, ప్రవర్తన మార్చుకొమ్మని హెచ్చరించిందా తల్లి. దీంతో బాగా కోపం పెంచుకొని, తల్లిని చున్నీతో ఉరి తీసి చంపి శవం ఇంట్లో ఉండగానే ప్రియుడితో మూడు రోజులు గడిపి, తర్వాత కారులో శవాన్ని తీసుకెళ్లి రైలు పట్టాలపై పడుకోబెట్టి, అందరినీ నమ్మించింది.


కీర్తి పేరు పెట్టుకున్న కూతురు తల్లినే చంపి ఇంతటి అపకీర్తి ఎందుకు తెచ్చింది. కన్న పిల్లల మనసు ఇంత విషపూరితం ఎందుకు అవుతోంది? చందమామ, బాల మిత్ర కథలు, సత్య హరిశ్చంద్ర, రామాయణ, మహాభారత కథలు - ఇలా మొన్నటి దాక వినోదం అంటే నైతిక సూత్రాల పాఠాలు. ఇప్పుడు వినోదం అంటే కుటుంబంలో ఒకరిపై ఒకరు విద్వేషాలు పెంచుకొనే పాత్రలతో టీవీ సీరియల్స్, వీడియో గేమ్స్ , క్రైమ్ న్యూస్, చెత్త సినిమాలు నెట్ ఫ్లిక్ , యూట్యూబ్ షార్ట్ మూవీస్ – వీటితో పిల్లల మనస్సులోకి విషం ఎక్కించడమే.


ఇలా తల్లితండ్రికి తెలియకుండానే ప్రతి ఇంట్లో మనసు విద్వేషాలతో నిండిన పిల్లలు తయారవుతున్నారు. హైదరాబాద్ లో రాత్రి పది గంటల తరువాత ఏదైనా పబ్ లోకి అడుగుపెడితే అర్థం అవుతుంది. చెడును ఒంటపట్టించుకోవడంలో అమ్మాయిలు కూడా అబ్బాయిలను దాటిపోతూ.. లింగ భేదాన్ని ఎలా చెరిపేస్తున్నారో. మన పిల్లల బాగుకోసం ప్రభుత్వాలు, సంస్థలను నిందించి లాభం లేదు. ఈ సమస్యలకు పరిష్కారం తల్లితండ్రుల చేతుల్లోనే వుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: