ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగ సంఘాల నేతలు.. అందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. మేం పిలిచినా ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు రావడం లేదని ప్రభుత్వం పదేపదే ప్రచారం చేస్తోంది. వాస్తవానికి కూడా అదే వాస్తవం.. చర్చల కోసం మంత్రుల కమిటీ వేసినా దాన్ని ఉద్యోగ సంఘాల నేతలు ఏమాత్రం నమ్మడం లేదు. ఇప్పటికే ఎన్నోసార్లు చర్చలు జరిపామని.. అయినా తమకు అనుకూలమైన నిర్ణయం తీసుకోకుండా తమ జీతాలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు.


అయితే.. ఇలా చర్చలకు వెళ్లకుండా మొండికేయడం వల్ల సమస్య ఇంకా జటిలం అవుతుంది. అందుకే ఉద్యోగ సంఘాల నేతలు కాస్త మెత్తబడ్డారు. అయితే ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఓ ప్రతిపాదన పంపారు. ఇకపై ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక ఆహ్వానం ఉంటేనే చర్చలకు వెళ్తామని షరతు విధిస్తున్నారు. చర్చల కంటే ముందు మూడు ప్రధాన డిమాండ్లను నెరవేరిస్తేనే చర్చలకు వెళ్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.


ఇంతకీ ఈ మూడు డిమాండ్లు ఏంటో తెలుసా.. ఇప్పటికే కొత్త పీఆర్సీని అమలు చేసేలా జారీ చేసిన జీవోలను రద్దు చేయాలనేది మొదటి డిమాండ్.. ఆ తర్వాత పాత నెల జీతమే ఈ నెలకు కూడా ఇప్పించాలనేది రెండో షరతు. మూడోది అశుతోష్ కమిటీ నివేదికను బయటపెట్టాలన్నది మూడో డిమాండ్.. ఈ మూడు డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరిస్తే.. తక్షణమే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.


మరి ఈ షరతులపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే విడుదల చేసిన ప్రభుత్వ జీవోలను వెనక్కి తీసుకోవడం కుదరదని ప్రభుత్వం చెబుతోంది. ఆ విషయంపై ప్రభుత్వం గట్టిగా ఉంటే.. చర్చలు మొదలయ్యే అవకాశాలు తక్కువే. అశుతోష్ కమిటీ నివేదిక విషయంలో మాత్రం ప్రభుత్వం మొదటి నుంచి గోప్యంగానే ఉంచుతోంది. మరి ఇకనైనా చర్చలు త్వరలోనే ప్రారంభం అవుతాయా.. ఈ పీఆర్సీ గొడవ వ్యవహారం సెటిల్‌ అవుతుందా.. ఏమో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: