సర్ఫరాజ్‌ ఖాన్‌ గురించి ఈమధ్య కాలంలో బాగా వినే వుంటారు కదా. దేశవాలీ టోర్నీల్లో ముఖ్యంగా రంజీ ట్రోఫీలో చిచ్చర పిడుగులా పరుగులు వర్షం కురిపిస్తున్న ఈ ముంబై మొనగాడు సర్ఫరాజ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అయితే తాజాగా మరోసారి ఇతగాడు వార్తల్లో నిలిచాడు. ఈసారి వార్తల్లో కెక్కింది తన వ్యక్తిగత ప్రదర్శనకు సంబంధించి కాదు. అవును, తన తమ్ముడు ముషీర్ ఖాన్ గురించి ఇపుడు మాట్లాడుకోబోతున్నాము. రంజీల్లో ముంబైకే ప్రాతినిధ్యం వహించే 17 ఏళ్ల ముషీర్ ఖాన్.. కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ-2023లో భాగంగా హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో ట్రిపుల్ సెంచరీ చేసి ఆహుతుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తించాడు.

సదరు మ్యాచ్ లో కేవలం 367 బంతుల్లో 34 ఫోర్లు, 9 సిక్సర్ల చేసి 339 పరుగులు స్కోర్ చేశాడు. ట్రిపుల్ సెంచరీతో ముషీర్ చెలరేగడంతో ముంబై 704 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆల్ రౌండర్ అయిన ముషీర్ గత నెలలోనే రంజీల్లోకి అరంగేట్రం చేసి ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చలేక జట్టులో స్థానం కోల్పోవడం గమనార్హం. అయితే సౌరాష్ట్రతో జరిగిన తన డెబ్యూ మ్యాచ్లో వికెట్లు పడగొట్టకుండా కేవలం 35 (12, 23) పరుగులు చేసిన ముషీర్.. అస్సాంతో జరిగిన రెండో మ్యాచ్లో 42 పరుగులు చేసి 2 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు.

అయితే, అన్న సర్ఫరాజ్ లాగే పట్టువదలని ముషీర్.. కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో హైదరాబాద్ పైన ట్రిపుల్ సెంచరీ బాది, ముంబై యాజమాన్యం తనవైపు తిరిగి చూసేలా చేశాడు. మరోపక్క రంజీ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ 92.66 సగటున 556 పరుగులు చేశాడు. ఇకపోతే తన ప్రదర్శన కారణంగా సర్ఫరాజ్ ఇండియా-ఏ టీమ్లో అయితే చోటు దక్కించుకోగలిగాడు కానీ, జాతీయ సెలెక్టర్లు మాత్రం ఈ ముంబై కుర్రాన్ని ఇప్పటికీ కరుణించడం లేదు. ఆసీస్ తో త్వరలో ప్రారంభంకానున్న టెస్ట్ సిరీస్ కోసం ప్రకటించిన టీమిండియాలో చోటు ఆశించి భంగపడ్డ సర్ఫరాజ్కు శ్రేయస్ అయ్యర్ రూపంలో అదృష్టం కలిసొస్తుందేమో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: