టాలీవుడ్‌లో టాప్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న యూవీ క్రియేష‌న్స్ గత కొంతకాలంగా సరైన స్పీడ్ చూపలేకపోయింది. ఒకప్పుడు వరుస ప్రాజెక్టులు చేస్తూ, క్వాలిటీ మేకింగ్‌తో మంచి పేరు సంపాదించిన ఈ సంస్థ, ‘సాహో’ తర్వాత కాస్త స్లో అయింది. భారీ అంచనాల నడుమ వచ్చిన సాహో వాణిజ్య పరంగా బలంగా నిలబడలేకపోవడంతో, బ్యానర్ ఇమేజ్‌పై ప్రభావం పడింది. అదేవిధంగా ‘విశ్వంభర’ వాయిదాలు, ఆ ముందు చేసిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో వర్కవుట్ కాకపోవడంతో, యూవీ నుండి కొత్త ప్రాజెక్టులు రావడం మందగించింది.


అఖిల్ తో ఓ సినిమా చేయాల్సి వచ్చినా, అది పక్కకు వెళ్లిపోయింది. ప్రస్తుతం యూవీ నుంచి ఉన్న ఏకైక ప్రాజెక్ట్ ‘కొరియన్ కనకరాజు’ మాత్రమే. ఈ గ్యాప్ కారణంగా చాలామంది సినీ ప్రేమికులు, ట్రేడ్ వర్గాలు యూవీ క్రియేష‌న్స్ గత జోరు తిరిగి వస్తుందా లేదా అని సందేహం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఆ అనుమానాలన్నింటికీ చెక్ పెట్టేలా యూవీ ఒక క్రేజీ కాంబినేషన్‌కి రెడీ అవుతోందని సమాచారం. మోహన్‌లాల్ – ధనుష్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ చేయడానికి ప్లానింగ్ జరుగుతోందట. కథ ఇప్పటికే రెడీ అయ్యిందనీ, ఇద్దరు హీరోలు కూడా విన్న వెంటనే ‘ఓకే’ చెప్పేశారన్న టాక్ ఫిలింనగర్‌లో గట్టిగా వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు దర్శకుడు ఎవరు అనేది త్వరలో అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా, ప్రస్తుతం వాయిదాపడిన ‘విశ్వంభర’ 2026 వేసవిలో విడుదలయ్యేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు.

 

ఇంతలో ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ అవుతుంది. ఆ తరువాతే మోహన్‌లాల్ – ధనుష్ మల్టీస్టారర్ సెట్స్‌పైకి వెళ్లబోతుందని సమాచారం. దీని వెంటనే మరో రెండు చిన్న సినిమాలు కూడా మొదలుపెట్టాలని యూవీ నిర్ణయం తీసుకుంది. టాలీవుడ్‌లో యూవీ క్రియేష‌న్స్ లాంటి సంస్థలు గ్యాప్ ఇవ్వకూడదు అన్నది ఇండస్ట్రీ టాక్. ఎందుకంటే, ఈ బ్యానర్ క్వాలిటీ మేకింగ్‌కి, నూతనతకు ప్రతీకగా నిలిచింది. ప్రతి ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభవం ఇవ్వాలనే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మల్టీస్టారర్, ప్యాన్‌ ఇండియా లెవెల్ సినిమాలు, చిన్న సినిమాలు అన్నీ బలంగా లైన్‌లో పెట్టడం ద్వారా మళ్లీ ఆ జోరును తిరిగి తెచ్చుకోవాలని చూస్తోంది. మొత్తం మీద యూవీ క్రియేష‌న్స్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చే టైమ్ దగ్గరపడింది. మోహన్‌లాల్ – ధనుష్ కాంబినేషన్ మాస్ ఆడియన్స్‌లో ఎంత హైప్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: