హిందూ మతంలో గ్రహణాలకు ఎప్పటినుంచో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. చంద్ర గ్రహణం ఒక నెలలో వస్తే, సూర్య గ్రహణం ఇంకో నెలలో వస్తుంది. కానీ ఒకే నెలలో రెండూ వస్తే దాని ప్రభావం తప్పకుండా ఉంటుందని పండితులు చెబుతారు. ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది సెప్టెంబర్ 21న రెండో పాక్షిక సూర్య గ్రహణం జరగబోతోంది. అయితే ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు కాబట్టి మనకు సూతక కాలం వర్తించదు. గ్రహణ సమయం:ఈ సూర్యగ్రహణం సెప్టెంబర్ 21న రాత్రి 10:59 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 22న తెల్లవారుజామున 3:23 గంటలకు ముగుస్తుంది. అంటే దాదాపు 4 గంటలపాటు కొనసాగుతుంది.
 

ఈ గ్రహణం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, అట్లాంటిక్ మహాసముద్రం, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం ప్రాంతాల్లో కనిపించనుంది. భారత్‌లో మాత్రం కన్పించదు. అందుకే ఆలయాలు మూసివేయాల్సిన అవసరం లేదు. పాక్షిక సూర్యగ్రహణం అంటే ఏమిటి? ఈ సమయంలో చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పేస్తాడు. దాంతో సూర్యుడు పూర్తిగా కప్పబడక, కొంతమేర మాత్రమే కాంతి తగ్గుతుంది. ఆ సమయంలో సూర్యుడు నెలవంకలా కనిపిస్తాడు. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కంటే భిన్నం. జాగ్రత్తలు:గ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడటం ప్రమాదకరం. ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాలు కళ్లకు హాని చేస్తాయి. అందుకే పెద్దలు ఎప్పుడూ “నేరుగా చూడకూడదు” అని చెబుతారు.



 చూడాలనుకుంటే ప్రత్యేక గాజులు, టెలిస్కోపులు లేదా ఆఫ్టికల్ పరికరాల ద్వారా మాత్రమే చూడాలి. గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండాలని, ఆధ్యాత్మిక చింతన చేయడం మేలు చేస్తుందని పండితులు సూచిస్తున్నారు. భవిష్యత్ సూర్యగ్రహణాలు: 2025 సెప్టెంబర్ 21 గ్రహణం ఈ ఏడాదిలో చివరి సూర్యగ్రహణం. కానీ 2027 ఆగస్టు 2న జరగబోయే సూర్యగ్రహణం ఈ దశాబ్దంలోనే అతి పెద్దది. ఆ తర్వాత ఇలాంటి అరుదైన గ్రహణం 2114 సంవత్సరంలో మాత్రమే జరగనుంది. చివరగా, ఈ కథనంలో చెప్పిన విషయాలు పురాణాలు, శాస్త్రాలు మరియు నిపుణుల అభిప్రాయాల ఆధారంగా మాత్రమే. శాస్త్రీయంగా ఇవి నిర్ధారించబడలేదు. నమ్మకం పూర్తిగా వ్యక్తిగతం.

మరింత సమాచారం తెలుసుకోండి: