దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలను ఆదుకోవడానికి, వారికి ఆర్థికంగా మద్దతు అందించడానికి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్‌ను ఆవిష్కరించింది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా రైతులు ప్రతి ఏడాది రూ.6,000 పొందుతున్నారు. మూడు విడతల్లో రైతులకు ఈ డబ్బులు అందుతాయి.



ఈ స్కీం ద్వారా అందే డబ్బులు నేరుగా రైతుల అకౌంట్లలోనే జమవుతున్నాయి. అయితే ఈ మొత్తాన్ని పెంచాలని చాలా సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. రూ.6,000 ఏమాత్రం సరిపోవని వారి వాదన. రైతులకు రూ.2,000 చొప్పున అందజేసే సాయం వల్ల ఎక్కువగా ప్రయోజనం కలుగలేదని వారు అభిప్రాయపడుతున్నారు. 2016 ఆర్థిక సర్వే ప్రకారం.. 17 రాష్ట్రాల్లో రైతుల వార్షిక ఆదాయం కేవలం 20 వేల రూపాయలు. వీరి ఆదాయం పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే.. రైతులకు అందించే ఆర్థిక సాయం కూడా పెంచాల్సి ఉంటుందని వ్యవసాయ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. స్విట్జర్లాండ్‌ దేశంలో అయితే అక్కడి ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ.లక్ష చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తోందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సంపాల్ శాస్త్రి తెలిపారు. 2017లో ఈయన స్విట్జర్లాండ్ వెళ్లి అక్కడి వ్యవసాయ పద్ధతులు పరిశీలించి వచ్చారు. సన్నకారు రైతులకు ఏడాదికి రూ.20 వేలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈయన మాత్రమే కాకుండా ఇంకా చాలా సంస్థలు పీఎం కిసాన్ డబ్బులు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.



పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు అందించే డబ్బులను రూ.6,000 నుంచి రూ.15,000కు పెంచాలని స్వామినాథన్ ఫౌండేషన్ డిమాండ్ చేస్తోంది. మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కూడా అన్నదాతలకు సంవత్సరానికి రూ.12,000 అందజేయాలని కేంద్రానికి సూచించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గ్రూప్ చీఫ్ ఎకనమిస్ట్ అడ్వైజర్ సౌమ్య క్రాంతి ఘోష్ కూడా పీఎం కిసాన్ డబ్బులను రూ.8,000కు పెంచాలని తన రీసెర్చ్ పేపర్‌లో పేర్కొన్నారు. నేషనల్ ఫార్మర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక సభ్యుడు వినోద్ ఆనంద్ కూడా రైతులకు సంవత్సరానికి రూ.24,000 అందించాలని డిమాండ్ చేశారు. కిసాన్ శక్తి సంఘ్ ప్రెసిడెంట్ పుష్పేంద్ర సింఘ్ రైతులకు నెలకు రూ.2,000 అందించాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా వీరి అభిప్రాయాలను, రైతుల కష్టాలను పరిగణలోకి తీసుకొని పీఎం కిసాన్ డబ్బులు పెంచింతే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: