నిజానికి ఆరేపల్లి సర్పంచ్ ఇసురు మల్లేష్.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు అనుచరుడు కూడా. మల్లేష్ సర్పంచ్ పదవి చేపట్టి నుంచి ఇంతవరకు నయా పైసా అభివృద్ధి జరగలేదు. ఏకగ్రీవం అయితే ఇస్తామన్న 15 లక్షలు రాలేదు. అభివృద్ధి పనులూ మంజూరు కాలేదు. చేయాల్సిన చిన్నపాటి పనులకూ డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో మల్లేష్ తన సొంత నిధులతో కొన్ని పనులు చేశారు. పారిశుద్ధ్య పనులు, దోమల మందు పిచికారీ, మొక్కలు నాటడం, రోడ్లకు మరమ్మతులు స్వయంగా చేపట్టారు. ఏదో ఓ రోజు ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తాయనే నమ్మకంతో కొన్ని కాంట్రాక్టు పనులు కూడా చేశారు. నెలలు గడుస్తున్నా నయా పైసా రాకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన నెలకు 5 వేల రూపాయల గౌరవ భృతి కూడా రెగ్యులర్గా రావడం లేదు. ఆర్థిక ఇబ్బందులు అధికం కావడం, కుటుంబ పోషణ భారం కావడంతో.. నిజామాబాద్లోని ఓ అపార్ట్ మెంటులో సెక్యురిటీ గార్డుగా మల్లేష్ చేరాడు. పగలంతా ఊరి సర్పంచ్గా ఉండే మల్లేష్... రాత్రి కాగానే అపార్ట్మెంట్ వాచ్మన్గా పనిచేస్తూ కనిపించడం చర్చనీయాంశంగా మారింది.
ఆరేపల్లి గ్రామంపై అధికార టీఆర్ఎస్ పార్టీకి చిన్నచూపు ఎందుకు అని ప్రశ్నిస్తే.. గ్రామస్థులంతా ఒక్కటే కారణం చెబుతున్నారు. అదేమిటంటే- గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈ గ్రామస్థులు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్కు మద్దతు పలికారు. ఇక్కడి 200 పైచిలుకు ఓట్లలో 90 శాతం బీజేపీకి పడ్డాయి. అందుకే ఇటు ముఖ్య నేతలు, అటు అధికారులు ఈ గ్రామంపై చిన్నచూపు చూస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే అసలు ఈ గ్రామాన్నే పట్టించుకోవడం లేదు. అందుకే గ్రామంతో పాటు ఆ గ్రామాన్ని పాలిస్తున్న సర్పంచ్నూ వేధిస్తున్నారని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.