సుప్రింకోర్టు నుండి ఈ స్ధాయిలో షాక్ తగులుతుందని నరేంద్రమోడీ ఊహించుండరు. కొద్దిరోజుల క్రితం మోడీపై బీబీసీ విడుదల చేసిన ఒక డాక్యుమెంటరీ దేశంలో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. గుజరాత్ సీఎంగా మోడీ ఉన్నపుడు గోధ్రా అల్లర్లు జరిగిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ముస్లింలు-హిందువులకు మధ్య జరిగిన అల్లర్లలో వేలాదిమంది ముస్లింలు దారుణంగా హత్యలకు గురయ్యారు. మత కలహాల ముసుగులో జరిగిన నాటి దారుణంతో ప్రపంచం మొత్తం నెవ్వరపోయింది.




అప్పట్లో జరిగిన అల్లర్లకు బీజేపీ, మోడీయే కారణమని ప్రతిపక్షాలు ఇప్పటికీ ఆరోపణలు, విమర్శలు చేస్తునే ఉంటాయి. ఘటన జరిగి సుమారు 25 ఏళ్ళయినా ఇప్పటికీ ఆ ఘోరకలిని చాలామంది తలచుకుంటునే ఉంటారు. అలాంటి ఘర్షణల నేపధ్యంపై బీబీసీ తాజాగా డాక్యుమెంటరీ తీసి విడుదలచేసింది. దాంతో బీజేపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే డాక్యుమెటరీని బ్యాన్ చేసింది. అయితే అప్పటికే దేశంలోని చాలా ప్రాంతాలకు ఆ డాక్యుమెంటరీ పాకిపోయింది.




ఇదే విషయమై ఢిల్లీ యూనివర్సిటిలో పెద్ద అల్లర్లు కూడా జరిగాయి. డాక్యుమెంటరీ ప్రదర్శించాల్సిందే అని కొందరు విద్యార్ధులు, ఎట్టి పరిస్ధితుల్లోను ప్రదర్శించేందుకు లేదని కేంద్రప్రభుత్వం సదరు డాక్యుమెటరీని నిషేధించింది. అలాంటి వివాదాస్పద డాక్యుమెంటరీపై సుప్రింకోర్టు విచారణ మొదలుపెట్టింది. ఈ సందర్భంగా డాక్యుమెటరీని బ్యాన్ చేయటం కుదరదని స్పష్టంగా తేల్చిచెప్పింది.



అలాగే దేశంలో బీబీసీ ఛానల్ ప్రసారం కాకుండా నిషేధం విధించాలని దాఖలైన పిటీషన్ను కూడా కోర్టు కొట్టేసింది. అంటే దేశంలో బీబీసీ నిషేధం లేదని సుప్రింకోర్టు చెప్పేసింది. ఇక డాక్యుమెంటరీ విషయమై చూచాయగా తన నిర్ణయాన్ని చెప్పేసింది. డాక్యుమెంటరీని నిషేధించాల్సిన అవసరం ఏమిటని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించింది. పైగా డాక్యుమెంటరీకి సంబంధించిన ఒరిజినల్ రికార్డులను తమకు సమర్పించాలని సుప్రింకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. మొత్తానికి సుప్రింకోర్టు నుండి కేంద్రానికి వ్యతిరేకంగా ఆదేశాలు వస్తాయని మోడీ ఏమాత్రం ఊహించుండరు. ఆ డాక్యుమెంటరీ గనుక ప్రసారమైతే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఇబ్బందులు తప్పవని మోడీ అనుకుంటున్నారా ?



మరింత సమాచారం తెలుసుకోండి: