తెలంగాణ రాష్ట్రంలోని బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల శ్రీనివాస కాలనీలో వీధికుక్కలు రెచ్చిపోయాయి. రోడ్డుపై ఆడుకుంటున్న అభంశుభం తెలియని చిన్నారిపై దాడి చేశాయి. వీధికుక్కల దాడిలో చిన్నారి తీవ్ర గాయాలపాలైంది. విషయం తెలిసిన వెంటనే పాప తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పాప మృతి చెందింది. పూర్తి వివరాలలోకి వెళితే చెంగిచెర్ల శ్రీనివాస కాలనీలో ఆమ్లోత్ బేబీ (6) నిన్న సాయంత్రం ఇంటి సమీపంలో ఆడుకుంటున్నది.
అదే సమయంలో పందుల కొట్టం దగ్గర ఉన్న కుక్కలు పాపపై దాడి చేశాయి. చిన్నారి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. బోడుప్పల్ డిప్యూటీ మేయర్ రవిగౌడ్ చిన్నారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. వీధి కుక్కలు నిర్మూలించడంలో విఫలమైన బోడుప్పల్ మున్సిపల్ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.