సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ఒక్కరి చేతిలో మరొక్కరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా దేశంలో మరో దారుణం చోటు చేసుకుంది. పరువు హత్యకు ఓ నవ వరుడు ప్రాణాలు కోల్పోయాడు. హరియాణాలో కులాంతర వివాహం చేసుకున్న యువకుడిని, యువతి  సోదరులు అతి దారుణంగా  హత్య చేశారు. పానిపట్  బిజీ మార్కెట్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. పరువు పేరుతో  ప్రేమికుల వరుస హత్యలు తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. ముఖ‍్యంగా హరియాణాలో గత మూడురోజుల్లో  ఇది రెండవ హత్య.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నీరజ్‌(23) ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. అయితే పెళ్లై నెలన్నర కాకముందే దురహంకారానికి బలైపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నీరజ్, తమ సోదరిని కులాంతర వివాహం చేసుకున్నాడనే అక్కసుతో నీరజ్‌ భార్య సోదరులు కక్ష పెంచుకున్నారు. మాట్లాడాలని పిలిచి మరీ దాడికి తెగబడ్డారు.  నీరజ్‌ను డజను సార్లు పొడిచి చంపి అక్కడినుంచి పరారయ్యారు. చాలాకాలంగా నిందితులు తన తమ్ముడిని బెదిరిస్తున్నారని, పోలీసుల రక్షణ కోరినా పట్టించుకోలేదని నీరజ్‌ సోదరుడు జగదీష్‌ వాపోయారు.

అయితే దాడికి కొన్ని నిమిషాలు ముందు నీరజ్‌ భార్యకు ఫోన్‌ చేసి.. త్వరలోనే ఏడుస్తావంటూ బెదిరించారని ఆరోపించాడు. పథకం ప్రకారమే తన సోదరుడిని పొట్టన పెట్టుకున్నారని కన్నీంటి పర్యంత మయ్యాడు. అయితే వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించి, ఇందుకు గ్రామ పంచాయతీ సమావేశంలో లిఖితపూర్వకంగా ఆమోదం తెలిపాయి. కానీ ఆ మహిళ సోదరులు అంగీకరించలేదని నీరజ్‌ దంపతులపై బెదిరింపులకు పాల్పడ్డారని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ సతీష్ కుమార్ వాట్స్ పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని నిందితులను పట్టుకంటామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: