నిర్మల్  జిల్లా భైంసాలో మరోసారి హింస చెలరేగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భైంసాలో భారీగా బలగాలను మోహరించారు. అక్కడి జనాలు కూడా తీవ్ర భయాందోళనలో ఉన్నారు. పట్టణంలో పోలీసు బలగాల కవాతును నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాల మీదుగా  ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది. బైంసా ఘటనపై రాజకీయ రగడ ముదురుతోంది. కేసీఆర్ ప్రభుత్వంపై, టీఆర్ఎస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. ఒక ప్రణాళిక ప్రకారమే భైంసాలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ఈ హింసకు పాల్పడిన అల్లరిమూకకు జిల్లా కలెక్టర్ మద్దతు ఉందని ఆరోపించారు. దీనికి సంబంధించి కేంద్ర నిఘా వర్గాలకు లేఖ రాస్తానని చెప్పారు. భైంసా అల్లర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు.

మంత్రి కేటీఆర్ బాలీవుడ్ మత్తులో మునిగిపోయారని... ఆ మత్తు నుంచి ఆయన బయటకు రావాలని అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ఓటు బ్యాంకు రాజకీయాల్లో మునిగిపోయారని అన్నారు. మత్తులో మునిగితేలుతున్న కేసీఆర్ తన మతాన్ని కూడా మర్చిపోయారని అన్నారు. భూకబ్జాల్లో కేటీఆర్ ను కవిత మించిపోయారని విమర్శించారు. హోం మంత్రి మహమూద్ చేతకాని స్థితిలో ఉన్నారని... లా అండ్ ఆర్డర్ తమకు అప్పచెపితే అల్లర్లను ఎలా కంట్రోల్ చేయాలో చేసి చూపిస్తామని అర్వింద్ చెప్పారు.

మరోవైపు ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.  భైంసా పట్టణంలో జరిగిన ఘటనకు కారకులైన నిందితులను వదిలే ప్రసక్తే లేదని జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ ప్రకటించారు. ప్రస్తుతం భైంసా పట్టణం ప్రశాంతంగా ఉందని, ప్రజలెవరూ భయాందోళనకు గురికావద్దన్నారు.  వదంతులను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టె వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని ఎస్పీ విష్ణు తెలిపారు. పట్టణంలోకి రావడానికి కొత్త వారికి ఎవరికీ అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: