రాజకీయాల్లో జరిగే పొరపాట్లు చాలా తీవ్ర నష్టాన్ని చేకూరుస్తాయి. ఈ విషయంలో ఎవరూ అతీతులు కారు. ముఖ్యంగా పొరపాటు చిన్నదైనా పెద్దదైనా అవి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి అనడంలో సందేహం లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ప్రతిపక్షం వైసిపి అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ శ్రేయోభిలాషుల పేరుతో, పార్టీ సానుభూతిప రుల పేరుతో కొందరు వ్యవహరిస్తున్న తీరు పార్టీకి శాపంగా మారుతోంది.. అన్న విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలి. ఈ వారంలో జరిగిన రెండు కీలక పరిణామాలు పార్టీని తీవ్ర స్థాయిలో కుదిపేసాయి.


ఒకటి సాక్షి మీడియాలో జరిగిన చర్చ. రెండు ప్ర‌కాశం జిల్లా పొదిలిలో జ‌రిగిన ఘ‌ట‌న‌. సాక్షి మీడియా చ‌ర్చ‌లో అమరావతి రాజధానిని అభివర్ణించిన తీరు మహిళల ఆగ్రహానికి, తీవ్ర స్థాయిలో నిరసనలకు కూడా దారితీసింది. తద్వారా పార్టీ గ్రాఫ్ చాలా వరకు తగ్గిపోయిందనే చెప్పాలి. ఇటు సానుభూతిపరులు, జగన్ అభిమానించేవారు కూడా ఈ వ్యాఖ్యలను సమర్ధించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండేవారు కూడా జగన్ను సమర్ధించేందుకు కానీ వైసీపీని సమర్థించేందుకు కానీ చాలా తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.


ఈ ప్రభావం ఇంకా తగ్గక ముందే తాజాగా ప్రకాశం జిల్లా పొదిలిలో చేసుకున్న పరిణామాలు మరింతగా పార్టీని ఇరుకున పడేసాయి. చెలరేగిన వైసీపీ కార్యకర్తలు మహిళలపై చెప్పులు రాళ్లు విస‌ర‌డం కచ్చితంగా ఎవరూ హర్షించే పరిస్థితి లేకుండా పోయింది. జగన్ వస్తున్నారని ఒకే ఒక కారణంతో అడ్డు అదుపు లేకుండా కొందరు కార్యకర్తలు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. రాళ్లు చెప్పులతో మహిళలపై దాడి చేయడం, పోలీసులను సైతం రాళ్లతో కొట్టడం వంటివి ఈ ఘటనల్లో ప్రధానంగా వివాదానికి దారితీసాయి. దీని నుంచి పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ తప్పించుకోలేనంతగా పరిస్థితి దిగజారిపోయింది.


ఇవి పైకి చూడ్డానికి చిన్నదిగా అనిపించినా.. చిన్న పొరపాటే అని సమర్ధించుకున్నా.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే మాత్రం పెద్ద గ్రహ పాటుగానే మారిందని చెప్పాలి. అటు సాక్షి ఛానల్ లో జరిగిన చర్చ- ఇటు పొదిలిలో జరిగిన పరిణామాలు పార్టీని, అదేవిధంగా జగన్ ను కూడా ఇరకాటంలోకి నెట్టాయి. నిజానికి పొదిలిలో ఇటువంటి దాడికి జరగకుండా ఉండి ఉంటే పొగాకు రైతుల పక్షాన జగన్ చేసిన వ్యాఖ్యలు, ఆయన పలికిన మద్దతు వంటివి మీడియాలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చేవి. కానీ.. వ్యూహాత్మక లోపాలు, చిన్నపాటి పొరపాట్లు వంటివి పార్టీని, పార్టీ అధినేతను కూడా డైల్యూట్‌ చేస్తున్నాయ‌నడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నుంచి అయినా పార్టీ కార్యక్రమాలు నిర్వహించే ముందు, కార్యకర్తలను సమీకరించే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: