నాని విషయానికొస్తే ఎక్కువ శాతం కుటుంబ కథా చిత్రాల వైపే మొగ్గు చూపుతుంటాడు. అందుకే నానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ. ఈ ఫాలోవర్స్ని లక్ష్యంగా సాగుతుంటాడు. కృష్ణార్జున యుద్ధం లాంటి మాస్ సినిమాలు చేసినా అవి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేదు. దీంతో లవ్, ఫ్యామిలీ మూవీస్కే మొగ్గుచూపుతున్నాడు. అయితే 'దసరా'తో మళ్లీ మాస్ జానర్లోకి వెళ్లాడు నాని. బొగ్గు గనుల కథాంశంతో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు.
ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండకి 'అర్జున్రెడ్డి'తో యూత్ గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. రౌడీస్టార్ అనే ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. అయితే యూత్ ఫాలోయింగ్ ఉన్నా ఈ హీరో మాత్రం మాస్ సినిమాలకి ఆమడ దూరంలో ఉన్నాడు. అయితే తొలిసారి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ బ్యాక్డ్రాప్తో మాసీ, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాపై విజయ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు.
మరోవైపు వరుణ్ తేజ్ సినిమా సినిమాకి చాలా మార్పులు చూపిస్తున్నాడు. 'ఫిదా, తొలిప్రేమ' లాంటి లవ్స్టోరీస్తో హిట్ కొట్టిన వరుణ్ మళ్లీ మాసీయాక్షన్ జానర్లోకి వచ్చాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ బ్యాక్డ్రాప్తో చేసిన 'గని' సినిమా బీ,సీ సెంటర్స్ లో ఉత్కంఠ రేపుతోంది. ఇంతకుముందు వరుణ్ మాస్ జానర్లోనే 'లోఫర్' అనే చిత్రంలో నటించాడు.
ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మొదటి నుంచి మాస్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేందుకు చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు. 'రాక్షసుడు' తప్ప బెల్లంకొండ కెరీర్లో ఊహించిన స్థాయిలో హిట్ లు లేవు. అయితే ఈ సారి పాన్ ఇండియన్ లెవల్లో మాస్ హీరో అనిపించుకోవడానికి 'ఛత్రపతి' రీమేక్ చేస్తున్నాడు. అలాగే గజదొంగ టైగర్ నాగేశ్వర్రావు లైఫ్ స్టోరీతో 'స్టువర్టుపురం దొంగ' అనే మూవీ చేస్తున్నాడు బెల్లంకొండ.