రైతు బంధులో నమోదుకు తెలంగాణ సర్కార్ మరో అవకాశం ఇచ్చింది. కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన వారు రైతు బంధు కోసం అప్లయ్ చేసుకోవాలని సూచించింది. యాంసగి రైతుబంధు పథకానికి కేసీఆర్ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నెల 10వ తేదీ నాటికి ధరణి పోర్టల్‌లో భూమి వివరాలు నమోదు అయిన రైతుల జాబితా సీసీఎల్‌ఏ ద్వారా రైతుబంధు పోర్టల్‌లోకి చేర్చారు. గతంలో రానివారు, వివరాలు సరిగా లేని రైతులకు మరో అవకాశం కల్పించారు. వారంతా ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. రైతుబంధు దరఖాస్తు ఫారంతో పాటు పట్టాదారు పాస్ బుక్‌, ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలను ఏఈవోలకు అందజేయాలని పేర్కొంది. మార్గదర్శకాలలో ఎలాంటి మార్పులు చేయలేదు.

     
ఈనెల 28 నుంచి రైతు బంధు నిధులు రైతులకు అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.ఇందుకోసం వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి కూడా నిధులు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. వీరి కోసమే ప్రభుత్వం ఈ నెల 20 వరకు అవకాశం కల్పిస్తోంది. కొన్ని జిల్లాలలో ఈ నెల 19 వరకే అవకాశం కల్పించారు.ముందుగా ఐదెకరాలలోపు విస్తీర్ణం ఉన్న రైతులకు సాయాన్ని విడుదల చేయనున్నారు.

గత ఏడాది యాసింగిలో 18.45 లక్షల మంది రైతులకు సాయం అందించలేదు. బ్యాంకు ఖాతాలు సరిగా లేకపోవడం, ఆధార్ సమస్యలతో రైతుబంధుకు దూరమయ్యారు. వానాకాలంలో 57 లక్షల మంది రైతులకు రైతుబంధు సొమ్ము విడుదల చేయగా, దాదాపు 4.20 లక్షల మంది ఖాతాలలో జమ కాలేదు. ఈసారి కూడా ఆధార్, ఖాతా వివరాలు సరిగా లేకపోవడంతో సొమ్ము బ్యాంకుల్లోనే మూలుగుతోంది. ఈసారి ధరణి పోర్టల్తో అనుసంధానించారు. 3.81 లక్షల మంది రైతుల వివరాలు ధరిణిలో సరితూగడం లేదు. వారికి రైతుబంధు వచ్చే పరిస్థితి లేదు.








మరింత సమాచారం తెలుసుకోండి: