గత ఏడాది సెప్టెంబర్ 15న పాపికొండల విహార యాత్రలో జరిగిన పెను ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రాయల్ వశిష్ఠ పున్నమి బోటు కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు బోటులో 77 మంది ఉండగా, కేవలం 26 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 39 మంది చనిపోయారు. మరో 12 మంది గల్లంతయ్యారు.
గోదావరి మునిగిపోయిన బోటును వెలికి తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సివచ్చింది. గోదావరి వరద ఉధృతి వల్ల ప్రమాద స్థలం నుంచి బోటు కొట్టుకుపోవడంతో పాటు ఇసుక మేటలు వేయడంతో వెలికి తీతకు ఇబ్బంది ఎదురైంది. అసలు బోటు ఎక్కడుందన్నది కూడా గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఇండియన్ నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాల ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. దీంతో గోదావరిలో బోటును గుర్తించి, వెలికి తీసే బాధ్యతను కాకినాడ బాలాజీ మెరైన్కు చెందిన ధర్మాడి సత్యం బృందానికి అప్పగించింది ప్రభుత్వం. రివర్ కూంబింగ్ విధానంలో బోటు ఆచూకీని గుర్తించిన ధర్మాడి బృందం.. ఎట్టకేలకు 200 అడుగుల లోతున ఇసుకలో కూరుకుపోయిన రాయల్ వశిష్ట పున్నమి బోటును వెలికి తీసింది.
బోటును వెలికి తీయడంతో జలసమాధి అయిన మరికొందరి మృతదేహాలు బయటపడ్డాయి. కాగా, ఈ ప్రమాదంలో 51 మంది చనిపోగా, 48 మంది మృతదేహాలే లభ్యమయ్యాయి. విశాఖకు చెందిన ఇద్దరు చిన్నారులతో పాటు మంచిర్యాలకు చెందిన యువతి మృతదేహం నేటికీ లభ్యం కాలేదు. కాగా, ఇసుకలో కూరుకుపోయిన బోటు.. వెలికి తీసే క్రమంలో పూర్తిగా దెబ్బతింది. ఆ నాటి ఘోర ప్రమాదానికి సాక్ష్యంగా కచ్చులూరులో గోదావరి ఒడ్డున బోటు శిథిలాలు దర్శనమిస్తున్నాయి.