ప్రతి దేవాలయాల్లో ప్రసాదం పంచడం ఆనవాయితీగా వస్తుంది.అలా మనం దేవుడికి నైవేద్యం పెట్టడం ద్వారా దేవుడిపై భక్తిని చాటుకుంటాం.ఇక గుళ్లో దేవుడి ప్రసాదం తీసుకుంటే.ఆ దేవుడి ఆశీస్సులు, వరం పొందవచ్చని ఒక నమ్మకం ప్రతి వారిలో ఉంది. ఇకపోతే దేవుడికి కొబ్బరికాయ, పూలు ఎంత ముఖ్యమో.. నైవేద్యంగా ప్రసాదం సమర్పించడం అంతే ముఖ్యంగా భావిస్తారు. కొందరు పంచభక్ష పరమాన్నాలు సమర్పిస్తే. మరికొందరు బెల్లంతో నైవేద్యం చేసి దేవుడికి పెడతారు.నైవేద్యాలలో తేడా ఎందుకంటే ఏది పెట్టినా దేవుడు సంతోషంగా స్వీకరిస్తాడు అనే నమ్మకం.
ఇక దేవాలయాల్లో పూజలు కూడా ఎంత భక్తితో చేస్తారో నైవేద్యాన్ని అంతే భక్తి శ్రద్దలతో స్వీకరిస్తారు. ఎందుకంటే పూజ అనంతరం దేవుడికి పెట్టిన నైవేద్యం తినడం వల్ల భోగ భాగ్యాలు, అష్టఐశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం. ఆ నమ్మకం ఒమ్ము కాకుండా భక్తులు ప్రసాదాన్ని సేవించేందుకు ఇష్టపడుతుంటారు. అయితే మనకు తెలిసి ప్రసాదం అంటే దద్దోజనం, వడపప్పు, పాయసం లాంటివి దేవుడిని బట్టి, ప్రాంతాన్ని బట్టి ఉంటాయి. కానీ తమిళనాడులోని తిరుమంగళం తాలుకా వడక్కంపట్టి గ్రామంలో ఉన్న మునియండి ఆలయంలో గత 83 ఏళ్లుగా మటన్ బిర్యానీని ప్రసాదంగా పంచిపెడుతున్నారట.
అయ్యో పెద్ద అపచారం అని అనుకోకండి ఇదే ఇక్కడి ఆచారమట. ఇక ఈ ఆచారం ఎలా వచ్చిందంటే 83 ఏళ్ల క్రితం ఎస్వీఎస్ సుబ్బనాయుడు మునీశ్వరుడి పేరుతో ప్రారంభించిన హోటల్ లాభాల బాట పట్టడంతో ఆ స్వామికి రెండేళ్లపాటు బిర్యానిని నైవేద్యంగా పంచిపెట్టారని, అప్పటి నుంచి ఆ ఆచారం కొనసాగుతున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ప్రతీ ఏటా జనవరి 24 నుంచి 26 వరకు నిర్వహించే ఆ ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా 200 మేకలు, 250 కోళ్లతో 2000 కేజీల బిర్యానీని తయారు చేసి.ఉత్సవాలకు వచ్చే భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారట.
ఇక ఈ మునియండి ఆలయానికి తారతమ్యం, వయో భేదం లేకుండా మటన్ బిర్యానిని సేవించడానికి భక్తులు వివిధ ప్రాంతలనుంచి తండోప తండాలుగా తరలి వస్తారని ఆలయ నిర్వాహక కమిటీ సభ్యుడు ఎన్.మునీశ్వరన్ తెలిపారు. ఇక మన సాంప్రదాయం ప్రకారం అసలు నాన్వెజ్ తింటేనే గుడికి వెళ్లం అలాంటిది ఈ గుళ్లో ఏకంగా నాన్వెజ్నే నైవేద్యంగా పెట్టడం వింతలో కెళ్ల వింతగా చెప్పుకుంటున్నారు.