ఈ క్రమంలోనే తమ ప్రేమను గెలిపించుకునేందుకు రహస్యంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఇలా పెద్దలను ఎదిరించిన ఆ ప్రేమజంట ను విధి ఓడించింది. పెళ్లి చేసుకునేందుకు వెళ్తున్న ఆ ప్రేమజంటను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. చివరికి ప్రియుడు మృతిచెందగా తీవ్రగాయాలతో ప్రియురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషాదకర ఘటన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం లో జరిగింది. కాకినాడ జగన్నాధపురం కి చెందిన గణేష్ అదే ప్రాంతానికి చెందిన దీప్తి కొంత కాలంగా ప్రేమ లో ఉన్నారు. ఇంట్లో చెబితే తమ ప్రేమకు అంగీకరిస్తారో లేదో అని భయపడి చివరికి అన్నవరంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమం లోనే ఇటీవల ద్విచక్రవాహనంపై బయలుదేరారు ఈ ప్రేమ జంట. అయితే తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో పిఠాపురం రాపర్తి సెంటర్కు వచ్చేసరికి 216 జాతీయ రహదారి పక్కన ఉన్న రైలింగ్ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గణేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక దీప్తి కొన ప్రాణాలతో ఇంకా చికిత్స పొందుతోంది. తన కుమారుడిని కావాలనే హత్య చేశారంటూ ఇక గణేష్ తల్లిఆరోపించిన నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.