జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిడిపి+ఎల్లోమీడియా=ఎల్లో బ్యాచ్ చేస్తున్న కుట్ర బయటపడిపోయిందా ? ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వంపై ఎల్లోబ్యాచ్ ఇంతగా కక్ష కట్టిందా ? ఆ కక్షతోనే ప్రభుత్వాన్ని కూల్చేద్దామన్న కుట్రకు తెరలేపిందా ? అనే అనుమానాలకు ఎల్లోమీడియాలో ప్రతి ఆదివారం వచ్చే కొ(చె)త్తపలుకులో సమాధానాలు కనిపిస్తాయి. తాజాగా ’వినాశకాలంలో  విపరీత బుద్ధులు’ పేరుతో అచ్చయిన  కథనం చదివిన వాళ్ళకు ఇవే అనుమానాలు రావటం ఖాయం. చాలా పేద్ద కథనంలో అనేక అంశాలున్నప్పటికి మొత్తంగా చూస్తే అర్ధమయ్యేదేమంటే జగన్మోహన్ రెడ్డిపై విషం కక్కటమే. ఎలాగైనా ప్రభుత్వాన్ని కూల్చేయాలి అర్జంటుగా చంద్రబాబునాయుడును మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంపై చూసేయాలన్న ఆతృతే కనబడుతోంది. 151 మంది ఎంఎల్ఏలున్న జగన్ పడిపోవటం ఎలాగ ? కేవలం 20 మంది ఎంఎల్ఏలున్న చంద్రబాబును సిఎం చేయటం ఎలాగన్న విషయం అర్ధంకాక పిచ్చిపిచ్చి రాతలు రాస్తున్న విషయం అర్ధమైపోతోంది.




చాలా అంశాలను ఉదహరిస్తు జగన్ పై ఆర్కే  విషం చిమ్మినా ఒక విషయంలో మాత్రం తన అంతరంగాన్ని స్పష్టంగా బయటపెట్టేసుకున్నాడు వేమూరి. అదేమిటంటే, అవినీతి కేసుల్లో తనను కేంద్రప్రభుత్వం జైలుకు పంపటం ఖాయమని జగన్ మానసికంగా సిద్ధమైపోయాడట. అందుకనే ప్రత్యామ్నాయంగా తన భార్య భారతిని ముఖ్యమంత్రిని చేయాలని కూడా జగన్ డిసైడ్ చేసేశాడట.  బిజెపిలో వైసిపిని విలీనం చేయమని ఇదివరకే అడిగినా జగన్ కుదరదుపొమ్మనాడట. అందుకని సమయం చూసుకుని జగన్ను దెబ్బ కొట్టడానికి బిజెపి రెడీగా ఉందని వేమూరి తేల్చేశాడు. 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానని నమ్ముతున్న జగన్ భవిష్యత్ బిజెపి చేతిలో ఉందని చెప్పటమే విచిత్రంగా ఉంది. ఒకవేళ కేసులను దృష్టిలో పెట్టుకుని జగన్ భవిష్యత్ బిజెపి చేతిలో ఉందని ఆర్కే అనుకుంటే అదే పద్దతిలో చంద్రబాబు భవిష్యత్ కేసీయార్  చేతిలో ఉందని  మరచిపోయినట్లున్నాడు.




ఇక విజయవాడలో స్వర్ణాప్యాలెస్ కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో యాజమాన్యం పోతిన రమేష్ చౌదరిపై కేసు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రమాదాన్ని ప్రమాదంగా మాత్రమే చూడాలని ఆర్కె ప్రభుత్వానికి ఇపుడు చెబుతున్న బుద్దులు వైజాగ్ కు సమీపంలోని  ఎల్జీ ఫ్యాక్టరీలో గ్యాస్ ప్రమాదం జరిగినపుడు ఏమైంది ? అప్పుడు మాత్రం ప్రమాదాన్ని ప్రమాదంగా ఎందుకు చూడలేకపోయాడు వేమూరి. కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోలేదని, కంపెనీ యాజమాన్యంపై కేసులు పెట్టలేదని ఎంత గోల చేసిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. గ్యాస్ ప్రమాదంలో కంపెనీ యాజమాన్యంపై కేసులు పెట్టలేదని, అరెస్టులు చేయలేదని ఎందుకు  గొంతులు చించుకున్నది. మరప్పుడు మాత్రం ప్రమాదాన్ని ప్రమాదంగా ఎందుకు చూడలేకపోయింది ? ఎందుకంటే ఎల్జీ కంపెనీ కమ్మ వాళ్ళది కాదు కాబట్టే అని జనాలనుకుంటే వాళ్ళ తప్పుకాదు.




స్వర్ణాప్యాలెస్ కోవిడ్ కేంద్రం నడుపుతున్న యజమాని పోతిన రమేష్ బాబు కమ్మ సామాజికవర్గంలో ప్రముఖుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావటంతోనే ప్రమాదంపై ఎల్లోబ్యాచ్ లో ఎవరూ నోరిప్పటంలేదని అందరికీ అర్ధమైపోయింది. అమరావతిని కొనసాగించుంటే ఈపాటికే హైదరాబాద్ లో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రులన్నీ వచ్చేసేవనే చెత్త లాజిక్ వేమూరికే చెల్లింది. చంద్రబాబు తన ఐదేళ్ళ కాలంలో అమరావతికి ఎందుకు  కార్పొరేట్ ఆసుపత్రులను రప్పించలేకపోయాడు ?  చంద్రబాబు వైఫల్యాలను కూడా జగన్ ఖాతాలో వేయటానికి చెత్తపలుకులో ఆర్కె తెగ అవస్తలు పడుతున్న విషయం తెలిసిపోతోంది. మొత్తంమీద జగన్ అంటే యావత్ ఎల్లోబ్యాచ్ ఎంత కసితో రగిలిపోతోందో అర్దమైపోయింది. ఇందులో భాగమే ప్రభుత్వానికి న్యాయవ్యవస్ధకు మధ్య అగాధం సృష్టించి జగన్ ప్రభుత్వాన్ని ఏదో చేసేద్దామన్న కుట్ర జరుగుతున్నట్లే జనాలకు అర్ధమవుతోంది.




చివరగా న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్ విషయం చూస్తే న్యాయమూర్తులపై నిఘా పెట్టడం ఇంతవరకు ఎక్కడా చూడలేదని రాశాడు. న్యాయమూర్తుల పై నిఘాపెట్టడం, ఫోన్లను ట్యాప్ చేయటం జగన్ ప్రభుత్వం చేసిందని వార్తలు వస్తున్నాయంటూ రాయటమే విచిత్రం. అసలా తప్పుడు వార్తలు రాసిందే ఆంధ్రజ్యోతి. తాను రాసిన వార్త నిజమే అయితే వార్తలు వస్తున్నాయని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది ?  జగన్ ప్రభుత్వం తమపై నిఘా పెట్టడం ఏమిటని న్యాయమూర్తులే ఆశ్చర్యపోతున్నారట. మరదే నిజమైతే ఆశ్చర్యపోయిన న్యాయమూర్తులెవరో ?  ఫోన్లు ట్యాప్ అయిన న్యాయమూర్తుల పేర్లను ఎల్లోమీడియా ఎందుకు బయటపెట్టడం లేదు ?  మొత్తంమీద జగన్ అరెస్టవ్వాలని, ప్రభుత్వం కూలిపోవాలని, వెంటనే 20 మంది ఎంఎల్ఏలతోనే చంద్రబాబు అర్జంటుగా ముఖ్యమంత్రి అయిపోవాలన్న తన కోరికను వేమూరి చెత్తపలుకులో బయటపెట్టేసుకున్నాడు. దీనికి అనుగుణంగానే జగన్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కుట్రలు కూడా జరుగుతున్నాయమో ?


మరింత సమాచారం తెలుసుకోండి: