ఏపీ ప్రభుత్వ విధానాలను.. ఏపీలోని అవకాశాలను వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా షో కేస్ చేస్తామన్న పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్.. సదస్సు ముగిసిన తర్వాత.. పెట్టుబడులు తెచ్చేలా కృషి చేస్తామన్నారు. పీపుల్-ప్రొగ్రెస్-పాజిబులిట్స్ అనే థీమ్ తో దావోస్ సమావేశానికి వెళ్తున్నామని పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అధికార వికేంద్రీకరణకు సంబంధించిన అంశాన్ని దావోస్ వేదికగా వివరిస్తామని.. ఏపీకి అతి పెద్ద తీరం ఉందని.. వనరులు ఉన్నాయని షోకేస్ చేస్తామని పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటున్నారు.
దావోస్లో సుమారు 30 మల్టీ నేషనల్ కంపెనీలతో భేటీ కాబోతున్నామని.. వ్యవసాయ రంగం మొదలుకుని వివిధ రంగాలకు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరిస్తామని పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో నిర్వహిస్తోన్న 52వ ప్రపంచ వాణిజ్య సదస్సుకు ఏపీ బృందం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో వెళ్లడం ఖారారైంది. ఈ మేరకు లోగోను పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఆవిష్కరించారు. కోవిడ్ -19 కారణంగా ప్రపంచమంతా అనిశ్చితి నెలకొందని.. ఇలాంటి సమయంలో అంతా కలిసి పనిచేయాలని, నమ్మకాన్ని పునర్నిర్మించుకోవడానికి స్థిరమైన పరిష్కారాల దిశగా ప్రపంచ సహకారాన్ని పెంచుకోవాలన్న ఉద్దేశంతో ఏపీ సీఎంని భాగస్వామ్యం కావాలని డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ కోరారని మంత్రి అమర్నాథ్ వివరించారు.