కెరీర్ ఆరంభంలో వరసగా కామెడీ సినిమాల్లో నటించి అగ్ర హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ ఆ తర్వాత కొంతకాలానికి వరుస అపజయాలని ఎదుర్కొన్నాడు. సుమారు 8 సంవత్సరాల వరకు అతనికి ఒక్క హిట్టు కూడా దక్కలేదు. అదే సమయంలో బుల్లితెరపై కామెడీ షోలు ఊపందుకోవడంతో ఆడియన్స్ అంతా కామెడీ కోసం థియేటర్స్ కి రావడం మానేశారు. దీంతో మన అల్లరి నరేష్ సినిమాలకు డిమాండ్ కూడా బాగా తగ్గిపోయింది. అప్పటినుండి కామెడీని పక్కనపెట్టి తనలోని నటుడ్ని బయటకు పెట్టే ప్రయత్నం చేశాడు అల్లరి నరేష్. ఈ క్రమంలోనే అతను చేసిన సరికొత్త ప్రయోగమే మహర్షి, నాంది, మారేడుమిల్లి ప్రజానీకం వంటి సినిమాలు. 

ఈ సినిమాల్లో అల్లరి నరేష్ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించి అదరగొట్టాడు. వీటిలో మహర్షి, నాంది సినిమాలు మంచి విజయాలను అందుకోగా.. గత ఏడాది వచ్చిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా మాత్రం అపజయాన్ని అందుకుంది. అయితే అల్లరి నరేష్ కెరీర్ లోనే మంచి కలెక్షన్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా మాత్రం 'నాంది' అనే చెప్పాలి. విజయ్ కనకమెడల ఈ సినిమాతో వెండితెరకి దర్శకుడుగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే తన దర్శకత్వ ప్రతిభతో ఆకట్టుకోగా.. ఇప్పుడు అదే నాంది దర్శకుడు విజయ్ కనకమెడలతో 'ఉగ్రం' అనే మరో సినిమా చేస్తున్నాడు అల్లరి నరేష్. ఈసారి ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఆకట్టుకోబోతున్నాడు.  

సైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ ఈరోజు విడుదలైంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే త్వరలోనే అల్లరి నరేష్ కింగ్ నాగార్జునతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వార్తలపై అల్లరి నరేష్ స్పందిస్తూ..' నాగార్జున గారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో ఓ సినిమా చేసేందుకు ఇప్పటికే కథా చర్చలు జరుగుతున్న మాట మాత్రం వాస్తవం. కానీ ఇంకా నేనా ప్రాజెక్టు ఓకే చేయలేదు. ప్రస్తుతం కథా చర్చలు అయితే జరుగుతున్నాయి. అన్ని పూర్తయ్యాక ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు దీనిపై పూర్తి స్పష్టత ఇస్తారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ గురించి అయితే ఎక్కువ మాట్లాడకూడదు' అంటూ చెప్పుకొచ్చాడు అల్లరి నరేష్. దీంతో త్వరలోనే నాగర్జున, అల్లరి నరేష్ కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ సినిమా అయితే ఉండబోతుందని స్పష్టమవుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: