కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బీజేపీ నేత యడ్యూరప్పకు ముందున్నది ముసళ్లపండుగే. ఈ ముళ్లబాటలో నడవడం అంతసులువు మాత్రం కాదనీ తాజా పరిణామాలు చెబుతున్నాయి. సీఎంగా బాధ్యతులు అయితే చేపట్టారుగానీ.. బలనిరూపణ పరీక్షను ఎలా నెగ్గుతారన్నదే ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. 104 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవరించినా మ్యాజిక్ ఫిగర్ 112 కొద్దిదూరంలోనే ఆగిపోయింది. ఇంకా ఏడుగురు సభ్యల మద్దతు కావాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునేందుకు ఇప్పటికే యెడ్డీ పావులు కదుపుతున్నారు.
ఈ క్రమంలో ఓ ఎమ్మెల్యే ఆయనకు చిక్కినట్టే చిక్కి చేజారిపోయినట్లు తెలుస్తోంది. ఆ స్వతంత్ర ఎమ్మెల్యేనే తనవైపు తిప్పుకోలేకపోయిన యెడ్డీ ఇక కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను లాగడం అసాధ్యమనే టాక్ వినిపిస్తోంది. బుధవారం ఉదయం బీజేపీ పంచన చేరిన ఆర్.శంకర్ అనే ఎమ్మెల్యే సాయంత్రానికి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మాజీ సీఎం సిద్ధరామయ్యకు అనుచురడైన శంకర్.. ఈ ఎన్నికల్లో రణబన్నూరు టికెట్ ఆశించారు. కానీ, కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో తమ పార్టీ తరఫున పోటీ చేయాలని బీజేపీ ఆఫర్ ఇచ్చినా ఆయన తీసుకోలేదు.
స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపోందారు. బుధవారం ఉదయం బీజేపీకి మద్దతివ్వాలని నిర్ణయించుకున్న శంకర్.. ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ గూటికి చేరడం గమనార్హం. దీంతో కమలదళం కంగుతినడం తప్ప ఏమీ చేయలేని పరిస్థతి ఏర్పడింది. ఒక్కరి విషయంలోనే ఇలా ఉంటే... ఏడుగురు సభ్యుల మద్దతు కూడగట్టడానికి యెడ్డి ఏం చేస్తారోమరి. అంతకుముందు జేడీఎస్ నేత రేవణ్ణ విషయంలోనూ బీజేపీ ఆడిన మైండ్ గేమ్ తిరగబడింది.
ఇదిలా ఉండగా..పూర్తి మెజారిటీ లేకున్నా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని గవర్నర్ ఆహ్వానించడాన్ని, ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, జేడీఎస్ నేతలు అసెంబ్లీ ఎదుట నిరసనకు దిగారు. 117మంది సభ్యులు ఉన్న కాంగ్రెస్-జేడీఎస్కు అవకాశం ఇవ్వకపోవడంపై మండిపడుతున్నారు. ముందుగా రాజ్భవన్ వద్ద ధర్నాకు దిగి.. ఆ తర్వాత అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.
ఈ నిరసనలో కాంగ్రెస్ అగ్రనేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, మల్లికార్జునఖర్గే, కేసీ వేణుగోపాల్, సిద్ధరామయ్యతోపాటు స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్ శంకర్ పాల్గొనడం కొసమెరుపు. బీజేపీ నిజస్వరూపాన్ని ప్రజల్లో ఎండగడతామని మాజీ సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని కాంగ్రెస్, జేడీఎస్లు నిర్ణయించాయి.