నిర్మల్ జిల్లాలోని భైంసా మరోమారు ఉద్రిక్తంగా మారింది. పట్టణంలోని ఓ కాలనీలో జరిగిన చిన్న గొడవ పెను వివాదానికి కారణమైంది. ఇరు వర్గాల మధ్య జరిగిన దాడిలో పలువురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం భైంసా నివురు గప్పిన నిప్పులా ఉంది.

పోలీసుల కథనం ప్రకారం.. జుల్ఫికర్ కాలనీలో రాత్రి ఏడున్నర గంటల సమయంలో కొందరు యువకులు సైలెన్సర్లు తొలగించిన బైకులపై పెద్ద శబ్దంతో కాలనీలో తిరిగారు. ఆ శబ్దాన్ని భరించలేని స్థానికులు వారిని నిలదీశారు. రైతులు, కూలీలు ఇళ్లకు వచ్చి నిద్రపోయే సమయమని, ఇంతటి శబ్దాలతో వారిని ఇబ్బంది పెట్టవద్దని యువకులకు సూచించారు.ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ప్రారంభమైన చిన్నపాటి ఘర్షణ పెద్దగా మారింది. పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది.

 బట్టీగల్లీ, పంజేషా చౌక్, కోర్బగల్లీ, బస్టాండ్ సహా పలు ప్రాంతాలకు ఘర్షణలు వ్యాపించాయి. ప్రత్యర్థి వర్గం జనావాసాలపైకి రాళ్ల దాడికి దిగడమే కాకుండా ఆటోలు, కారు, బైకులను తగలబెట్టారు. కత్తులతో వీధుల్లో హల్‌చల్ చేశారు. ఓ కూరగాయల దుకాణాన్ని తగలబెట్టారు. కవరేజీకి వెళ్లిన మీడియాపైనా కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ప్రముఖ పత్రికలకు చెందిన ముగ్గురు విలేకరులకు కూడా గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా మారడంతో ఇద్దరిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓ పోలీసు అధికారి, ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా రాళ్ల దాడిలో గాయపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు పట్టణంలో అదనపు బలగాలను మోహరించారు.

నిర్మల్ జిల్లాలోని భైంసాలో ఇటీవలే ఘర్షణలు జరిగాయి. ఇరు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడటంతో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. పోలీసు ఉన్నతాధికారులు బైంసాకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. వందలాది మంది బలగాలతో పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు. తాజాగా జరిగిన ఘర్షణలతో స్థానికులు తీవ్ర భయాందోళకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం బైంసో పరిస్థితులను డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: