వ్యవసాయ భూముల్లో వెంచర్లు వేయాలంటే.. ముందు వ్యవసాయేతరంగా మార్చుకోవాలి. ఆ తర్వాత మున్సిపల్ లేదా పంచాయతీ చట్టాలకు అనుగుణంగా వెంచర్లు ఏర్పాటు చేయాలి. ముందుగా 10 శాతం స్థలాన్ని స్థానిక సంస్థలైన పంచాయతీకి లేదా మున్సిపాలిటీకి కేటాయించాలి. వాటి పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలి. అలా చేయకపోతే వెంచర్కు భారీగా జరిమానా విధించాలని నిబంధనలు చెబుతున్నాయి. ప్రస్తుతం పెద్దపల్లి పట్టణ సమీపంలో ఉన్న భూములపై రియల్ వ్యాపారులు కన్నేశారు. రైతులకు డబ్బు ఎరవేసి.. వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తున్నారు. అనుమతులు లేకుండానే ప్లాట్లు వేస్తున్నారు. కొన్న ధరకు మూడింతల రేటు పెంచి.. ప్లాట్లను విక్రయిస్తున్నారు. అక్రమ వెంచర్లపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నా.. రియల్టర్లు పట్టించుకోవడం లేదు.
పెద్దపల్లి పట్టణంలో భారీగా వెలసిన వెంచర్లలో కొన్నింటికి మాత్రమే అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. ఇక అనధికారికంగా ఏర్పాటు చేసిన 18 లేఔట్లను అధికారులు గుర్తించారు. వాటిపై చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఓ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే వారు కార్యాలయం దాటి బయటకు రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సామాన్యులు మోసపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.