ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు, ఆందోళనలు చేసే వేదిక ఇందిరాపార్క్ ధర్నా చౌక్ అని.. ట్రాఫిక్ జాం, ప్రజలకు ఇబ్బంది పేరుతో ధర్నా చౌక్ వద్ద బీజేపీ చేపట్టబోయే ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడం విస్మయం కలిగిస్తోందని బండి సంజయ్ అన్నారు. ఇందిరాపార్క్ ను ధర్నా చౌక్ గా పునరుద్దరించిన తరువాత టీఆర్ఎస్, కాంగ్రెస్ సహా అనేక రాజకీయ పార్టీలు, సంఘాలు ఆందోళనలు నిర్వహించాయన్న విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు.
సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశాయని.. అప్పుడే లేని ఇబ్బంది బీజేపీ దీక్ష చేపడతానంటేనే వస్తోందా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని గొంతు నులిపేసే కుట్రేనని.. బీజేపీని అణిచివేసే చర్యగా భావిస్తున్నామని.. అసలు బీజేపీ పేరు వింటేనే ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోందని బండి సంజయ్ మండిపడ్డారు.
ప్రజా సమస్యలపై నిరంతరం గళమెత్తుతున్న బీజేపీను అణిచివేయాలని అడుగడుగునా సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని.. ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా బడ్జెట్ సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం అందులో భాగమేనని బండి సంజయ్ ఆరోపించారు. ధర్నా చౌక్ వద్ద సీఎంసహా టీఆర్ఎస్, కాంగ్రెస్ చేపట్టిన ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు అనుమతి ఇచ్చిన పోలీసులు బీజేపీ దీక్షకు అనుమతి ఇవ్వకపోవడం ముమ్మాటికీ పక్షపాత చర్యేనని బండి సంజయ్ తెలిపారు. మరి దీక్ష చేసి తీరతామని బీజేపీ ప్రకటించినందున ఇవాళ ధర్నా చౌక్ వద్ద రచ్చ రచ్చ తప్పదేమో..