
ఢిల్లీ మధ్యం కుంభకోణంలో సంబంధముందంటు తాజాగా ఎన్పోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమర్పించిన రిమాండ్ రిపోర్టులో 36 మంది పేర్లను చేర్చింది. ఈ పేర్లలో కల్వకుంట్ల కవిత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్లు కూడా ఉన్నాయి. కుంభకోణంతో సంబంధముందనే విషయంలో వీళ్ళిద్దరి పేర్లు చాలారోజులుగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కుంభకోణంలో కీలకపాత్ర పోషించాడంటు అమిత్ అరోరాను ఈడీ అరెస్టుచేసింది. ఈ సందర్భంగా సమర్పించిన రిమాండ్ రిపోర్టులో వీళ్ళిద్దరి పేర్లుండటమే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ మాగుంటకన్నా కవితే ఇంపార్టెంటు. ఎందుకంటే తెలంగాణాలో ఎంఎల్ఏల కొనుగోలు కేసు చాలా వేడిగా దర్యాప్తు జరుగుతోందికదా.
ఇదంతా చూస్తుంటే లెక్కసరిచేసేందుకు కవిత పేరును ఈడీ రిమాండ్ రిపోర్టులో పెట్టినట్లు అనుమానంగా ఉంది. హఠాత్తుగా కవితను ముందు విచారణకు పిలిచి తర్వాత అరెస్టు అంటారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే మంత్రి మల్లారెడ్డి వ్యాపారాలు, ఇళ్ళపైన సీబీఐ, ఈడీ, ఐటి ఉన్నతాధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. దాడుల్లో భాగంగా మల్లారెడ్డితో పాటు కొడుకు, అల్లుడు ఇళ్ళపైన కూడా మూడురోజులు సోదాలుచేశారు. ఇపుడు విచారణ కూడా జరుగుతోంది. అలాగే మరో మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ ఎంపీ రవిచంద్రను సీబీఐ విచారిస్తోంది.
టీఆర్ఎస్ ఎంఎల్ఏల కొనుగోలు కేసులో ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్) చాలా దూకుడుగా వెళుతోంది. బీజేపీలో కీలకనేత బీఎల్ సంతోష్ కు కూడా నోటీసులిచ్చి విచారణకు రమ్మన్నది. దాంతో బీజేపీ ఢిల్లీ స్ధాయిలో ప్రకంపనలు మొదలయ్యాయి. బీఎల్ సంతోషంటే నరేంద్రమోడీ, అమిత్ షా కు అత్యంత సన్నిహితుల్లో ఒకళ్ళు.
ఎంఎల్ఏ కొనుగోళ్ళ కేసులో బీజేపీ కీలకనేతల విషయంలో దూకుడుగా వెళుతున్న సిట్ ను నియింత్రించేందుకే కేసీయార్ కూతురు కల్వకుంట్ల కవిత పేరును ఈడీ రిమాండ్ రిపోర్టులో చేర్చినట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. సిట్ ను తమజోలికి రాకుండా అడ్డుకునేందుకే ఈడీని అడ్డుపెట్టుకుని బీజేపీ కవిత పేరును తెరపైకి తెచ్చిందనే ప్రచారం పెరిగిపోతోంది. మరీ లెక్క ఎలాగ సరి అవుతుందనేది ఆసక్తిగా మారింది.