రాష్ట్రం నుండి పరిశ్రమలను తరిమేస్తున్నారని గడచిన మూడున్నరేళ్ళుగా బురదచల్లేస్తున్న వాళ్ళ నోళ్ళు ఇప్పటికైనా మూతపడతాయా ? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చంద్రబాబునాయుడు అండ్ కో తో పాటు ఎల్లోమీడియాది ఒకటే గోల. అదేమిటంటే రాష్ట్రంలోకి పరిశ్రమలు రావటంలేదని, ఉన్న పరిశ్రమలను జగన్ తరిమేస్తున్నారని. నిజానికి వాళ్ళ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేకపోయినా మెజారిటి మీడియా చేతిలో ఉందికాబట్టి వాళ్ళిష్టం వచ్చినట్లు బురదచల్లేస్తున్నారు. మామూలు జనాలు కూడా దీన్ని నిజమనుకుంటున్నారు.





సీన్ కట్ చేస్తే శుక్రవారం ప్రారంభమైన రెండురోజుల అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో రు. 13 లక్షల కోట్ల విలువైన ఎంవోయులు జరిగాయి. జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలోని 340 సంస్ధలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించినట్లు జగన్ చెప్పారు. ఇందులో మొదటిరోజు 92 ఎంవోయులు కుదిరినట్లు ప్రకటించారు. మిగిలిన ఎంవోయూలు రెండోరోజు సదస్సులో జరిగాయి.





కీలకమైన గ్రీన్ ఎనర్జీ, లాజిస్టిక్స్, సిమెంట్, రియల్ ఎస్టేట్, స్టీల్, ఫార్మా లాంటి 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు బాగా ఆసక్తి చూపినట్లు చెప్పారు. ముఖేష్ అంబానీ మాట్లాడుతు తొందరలోనే 10 గీగావాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. మొత్తంమీద రెండురోజుల సదస్సుకు అంబానీ, కరణ్ అదానీ, ఒబెరాయ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అర్జున్ ఒబెరాయ్, రెన్యూపవర్ సీఎండీ సుమంత్ సిన్హా, జీఎంఆర్ ఛైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు లాంటి అనేకమంది ప్రముఖులు పాల్గొన్నారు. విదేశీ పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొన్నారు.





ఇక రెండోరోజు కూడా సుమారు 25 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. జరిగింది  చూస్తే పెట్టుబడుల సదస్సు సూపర్ సక్సెస్ అయినట్లే ఉంది. మరిప్పటికైనా చంద్రబాబు అండ్ కో, ఎల్లోమీడియా నోళ్ళు మూతపడతాయా అన్న అనుమానం పెరిగిపోతోంది. నిజంగానే ఇంతకాలం వీళ్ళు ఆరోపిస్తున్నట్లు జగన్ పారిశ్రామికవేత్తలను తరిమేస్తుంటే ఇపుడు ఇంతమంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఎందుకు వస్తారు ? లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు ఎందుకు చేసుకుంటారు ? 

మరింత సమాచారం తెలుసుకోండి: