ఆఫ్గనిస్తాన్ జట్టు ఆగష్టు 9 నుండి ఐర్లాండ్ పర్యటనలో ఉంది. ఇందులో భాగంగా అయిదు టీ 20 మ్యాచ్ లను ఆడింది. అయితే ఈ సిరీస్ లో పూర్తి ఆధిపత్యాన్ని ఐర్లాండ్ జట్టు చలాయించింది అని చెప్పాలి. మొదటి రెండు మ్యాచ్ లను ఐర్లాండ్ గెలుచుకోగా, ఆ తర్వాత రెండు మ్యాచ్ లను ఆఫ్గనిస్తాన్ గెలుచుకుని సిరీస్ ను సమం చేసింది. ఇక నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్ లో ఇరు జట్లు తప్పక గెలవాల్సి ఉండగా... ఐర్లాండ్ తన ఆటతీరుతో మ్యాచ్ ను మరియు సిరీస్ ను చేజిక్కించుకుంది. మరో వారం రోజుల్లో ఆసియా కప్ లో పాల్గొనాల్సి ఉండగా, ఇటువంటి సందర్భంలో ఆఫ్గనిస్తాన్ కు ఈ సిరీస్ ఓటమి మంచిది కాదు.
అయితే ఈ ఓటమిలో ప్రధాన పాత్ర మాత్రం మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ ది అని చెప్పాలి. ఈ సిరీస్ లో రషీద్ ఖాన్ అంత ప్రభావవంతంగా కనిపించలేదు. అయిదు మ్యాచ్ లలో కలిపి కేవలం 3 వికెట్లు మాత్రమే తీయగలిగాడు అంటే... తన బౌలింగ్ లో పదును తగ్గిపోయింది. మొత్తం 17 ఓవర్లు వేసి 102 పరుగులు ఇచ్చుకున్నాడు. దీనితో ఆఫ్గనిస్తాన్ శిబిరంలో నిరాశ అలుముకుంది. ఆసియా కప్ లో అయినా రషీద్ ఖాన్ రాణించాలని జట్టు యాజమాన్యం కోరుకుంటోంది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.