స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ తాజాగా మరో కొత్త క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది. దీనిపేరు డిజిస్మార్ట్ క్రెడిట్ కార్డు. తక్షణ డిస్కౌంట్, ఇతర ప్రయోజనాలు ఈ కార్డ్ ప్రత్యేకత. ఈ- కామర్స్ పోర్టల్స్, ట్రావెల్, ఎంటర్టైన్మెంట్, ఫ్యాషన్, గ్రాసరీ, ఫుడ్ డెలివరీ వంటి వివిధ రకాల కేటగిరి ప్రొడక్ట్స్పై తగ్గింపు పొందొచ్చు. డిజిస్మార్ట్ క్రెడిట్ కార్డు పొందాలంటే నెలకు రూ. 49 ఫీజు చెల్లించాలి. అయితే నెలలో కార్డు ద్వారా రూ.5 వేలకు పైగా ఖర్చు చేస్తే ఈ ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ కస్టమర్లకు డిస్కౌంట్, ఇతర ప్రయోజనాలు అందించేందుకు మింత్రా, గ్రోఫర్స్, జొమాటో, ఓలా, ఐనాక్స్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇటీవల కాలంలో సింపుల్ క్రెడిట్ ప్రొడక్టులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే కస్టమర్లకు ఆకర్షణీయ ఆఫర్లు, ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా డిజిస్మార్ట్ క్రెడిట్ కార్డు లాంచ్ చేశామని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జినేశ్ షా తెలిపారు.
అయితే నెలలో ఐదు సార్లు గ్రోఫర్స్ కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. గరిష్టంగా రూ.1000 తగ్గింపు పొందవచ్చు. మింత్రా పోర్టల్లో కొనుగోళ్లపై 20 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. నెలలోని తొలి లావాదేవీకి ఇది వర్తిస్తుంది. గరిష్టంగా రూ. 700 తగ్గింపు పొందవచ్చు. ఐనాక్స్ లో సినిమా టిక్కెట్లపై బై వన్ గెట్ వన్ ఆఫర్ పొందొచ్చు. అయితే శనివారం, ఆదివారాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. నెలలో రెండుసార్లు ఈ ఆఫర్ను ఉపయోగించుకోవచ్చు. ఒక లావాదేవీపై గరిష్టంగా రూ. 200 తగ్గింపు లభిస్తుంది.
అలాగే యాత్ర పోర్టల్లో ఫ్లైట్ బుకింగ్స్పై 20 శాతం తగ్గింపు లభిస్తుంది. మరియు రూ.5వేలకు పైన లావాదేవీలను ఈఎంఐ రూపంలోకి మార్చుకోవచ్చు. ఇక ఓలా క్యాబ్ బుకింగ్పై 15 శాతం క్యాష్బ్యాక్ లభిస్తుంది. నెలకు గరిష్టంగా రూ. 600 వరకు క్యాష్బ్యాక్ పొందొచ్చు. జొమాటో ఆర్డర్లపై కూడా 10 శాతం డిస్కౌంట్ ఉంది. ఐదు లావాదేవీలకు తగ్గింపు వర్తిస్తుంది. ఒక లావాదేవీపై గరిష్టంగా రూ.150 తగ్గింపు లభిస్తుంది.