తెలంగాణలో ముఖ్యంగా జంట నగరాలైన హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలలో ఇటీవలే మిస్సింగ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవలె షాద్నగర్ లోనూ మియాపూర్ లోనూ అమీర్పేట లోనూ ఇటువంటి ఏరియాలలో మిస్సింగ్ కేసులు కలకలం సృష్టించాయి. అయితే పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. వీటిని ఛేదించేందుకు హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న మిస్సింగ్‌ కేసులపై ఎక్కువగా దృష్టి సారించినట్లుగా సైబరాబాద్‌ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పరిధిలో నమోదవుతున్న కేసులన్నీ వ్యక్తిగత, మనస్పర్థల వల్లనే ఇంటి నుంచి వెళ్లిపోతున్నారని సీపీ చెప్పారు.

మైనర్లు తల్లిదండ్రులతో గొడవపడడం, లేదా వారు పిల్లల్ని తిట్టడం వంటి కారణాల వల్ల ఇంటి నుంచి వెళ్లిపోతున్న కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయని సీపీ అన్నారు. మిస్సింగ్‌ కేసు నమోదైన వెంటనే తాము ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి కేసును ఛాలెంజ్‌గానే తీసుకుంటున్నట్లు సీపీ చెప్పారు.కొద్ది రోజుల క్రితమే డాక్టర్‌ కేసు, గచ్చిబౌలి కేసు, పుణె అమ్మాయి కేసు అన్నింటినీ స్పెషల్‌ టీమ్స్‌తో చేధించినట్లు సీపీ చెప్పారు. ‘‘ముఖ్యంగా సోషల్‌ మీడియా అనేది పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. చిన్న చిన్న కారణాలకే పిల్లలు ఇంటి నుంచి అలిగి వెళ్లిపోతున్నారు. భార్యాభర్తల గొడవలు కూడా మరికొన్ని మిస్సింగ్‌ కేసులకు కారణమని ఆయన తెలిపారు. ముఖ్యంగా పిల్లలకు తల్లిదండ్రులపై గౌరవం ఉండాలి.

తల్లిదండ్రులకు పిల్లలపై దృష్టి ఉండాలి. అప్పుడే కాస్తయినా ఈ మిస్సింగ్‌ కేసులను అరికట్టగలం’’ అని సీపీ సజ్జనార్‌ అన్నారు.తెలంగాణలో మిస్సింగ్ కేసులపై హైకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే. మిస్సింగ్‌ కేసులపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం 8 వేల మిస్సింగ్ కేసులునమోదయ్యాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారి కేసులే అధికంగా ఉన్నాయని పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. మిస్సింగ్ కేసులపై చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: