టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న వారిలో రష్మిక మందన్న, పూజా హెగ్డే ఇద్దరూ కూడా ముందు వరుసలో ఉంటారు అని చెప్పక తప్పదు. ఇక వీరిద్దరూ ఒకదాని వెంట మరొకటి వరుసగా విజయాలు అందుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే గత ఏడాది సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి సినిమాలతో బ్లాక్బస్టర్ సక్సెస్ లు అందుకున్నారు రష్మిక మందన్న.ప్రస్తుతం ఆమె పుష్ప, ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాలు చేస్తున్నారు. అలానే మరోవైపు ఇటీవల అరవింద సమేత, గద్దలకొండ గణేష్, అలవైకుంఠపురంములో సినిమాల భారీ సక్సెస్ లతో ముందుకు సాగుతున్న పూజాహెగ్డే ప్రస్తుతం రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తోపాటు ఆచార్య సినిమాలు చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళితే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో రష్మిక మందన్న ఒక గిరిజన యువతి పాత్ర పోషిస్తున్నారని టాక్. ఈ సినిమాలో ఆమె పాత్ర లో కొంత నెగిటివ్ షేడ్స్ తో సాగినప్పటికీ తర్వాత ఆ పాత్ర పాజిటివ్ గా మారుతుందని ఆ క్యారెక్టర్ లో అత్యద్భుతంగా రష్మిక మందన్న నటిస్తున్నారని అంటున్నారు. మరోవైపు మెగాస్టార్, మెగా పవర్ స్టార్ ల తొలి కలయికలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ తో పాటు మరో హీరోయిన్ గా నటిస్తున్నారు పూజ హెగ్డే. ఈ సినిమాలో పూజా పాత్ర పేరు నీలాంబరి అని అలానే ఆమె ఇందులో ఒక గిరిజన యువతి పాత్ర పోషిస్తున్నారని అంటున్నారు.

సినిమాని కీలక మలుపు తిప్పే సమయంలో ఆమె పాత్ర ఎంటర్ అవుతుందని అలానే అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఆ పాత్రకు పూజాహెగ్డే జీవం పోశారని అంటున్నారు. మొత్తంగా యాదృచ్ఛికమో, కాకతాళీయమో తెలియదు కానీ అటు రష్మిక, ఇటు పూజాహెగ్డే ఇద్దరూ కూడా తొలిసారిగా గిరిజన యువతి పాత్రల్లో నటిస్తున్నారు. మరి వీరిద్దరిలో ఎవరు ఏ స్థాయిలో ఆడియెన్స్ ని ఆకట్టుకుంటారో తెలియాలంటే వారి సినిమాల విడుదల వరకు వెయిట్ చేయాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: