తెలుగులో హాస్యానికి హీరోయిజమ్ తీసుకొచ్చిన మొట్టమొదటి
హీరో ఆయన, తెలుగు వెండితెరపై నటకిరీటిగా గిలిగింతలు పెట్టిన హాస్యచక్రవర్తి ఆయన, ఎన్నో విభిన్నమైన పాత్రలకు నిలువెత్తు ఆలవాలం ఆయన, అన్ని వర్గాల ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేసిన గొప్ప నటుడు ఆయన. వైవిధ్యమైన పాత్రలకు, విమర్శకుల ప్రశంసలకు తిరుగులేని రారాజు ఆయన, ఆయనే నవ్వుల రాకుమారుడు 'రాజేంద్ర ప్రసాద్'.
ప్రధాన మంత్రులను సైతం అభిమానులుగా మార్చుకున్న ఏకైక
కామెడీ హీరో రాజేంద్రప్రసాద్. స్వర్గీయ
ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరులోనే
రాజేంద్ర ప్రసాద్ కూడా పుట్టారు. సిరామిక్ ఇంజనీరింగ్ లో డిప్లోమా కూడా చేశారు. అయితే,
ఎన్టీఆర్ సపోర్ట్ తో తెలుగు ఇండస్ట్రీకి వచ్చి హీరోగా నిలబడ్డారు. హీరో అయ్యే క్రమంలో ఎన్నో బాధలు, మరెన్నో అవమానాలు, తండ్రి సైతం ఆదరించని కఠినమైన క్షణాలు.. చివరకు చెన్నైలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఫీజు కట్టలేక అక్కడే పనిలో చేరారు.
అయినా కష్టాలు వదలలేదు. రోజురోజుకు బతుకు పై ఆశ పోతుంది. సూసైడ్ చేసుకుందామని నిర్ణయించుకున్నాక, డబ్బింగ్ చెప్పమని రాజేంద్రప్రసాద్ కి ఒక ఛాన్స్ వచ్చింది. అంతే దశ తిరిగింది. ఆ తర్వాత
హీరో, ఆ వెంటనే కామెడీ స్టార్ హీరో. జంధ్యాల, బాపు లాంటి లెజెండరీ దర్శకులు సహకారంతో రాజేంద్ర ప్రసాద్ కి ఇక తిరుగులేకుండా పోయింది.
'అహ నా పెళ్లంట'
సినిమా తర్వాత, నవ్వుల రారాజు అయిపోయాడు రాజేంద్రడు. అయితే, ఆయనను ఇప్పటికీ ఓ బాధ వ్యక్తిగతంగా వెంటాడుతుంది. అతి దగ్గర బంధువులే,
రాజేంద్రప్రసాద్ ను ఆస్తుల విషయంలో దారుణంగా మోసం చేశారు. తన ముప్పై ఏళ్ల సంపాదనలో ఎక్కువ భాగాన్ని ఆయన ఆ మోసంలోనే కోల్పోయారు.
ఆ మోసం చేసిన బంధువు వరుసకు ఆయనకు కూతురు అవుతారు. మోసపోవడం రాజేంద్రప్రసాద్ కు తీవ్రమైన ఆవేదనను కలిగించింది. ఏది ఏమైనా తెలుగు చిత్రపరిశ్రమలో రాజేంద్రప్రసాద్ ది విశేష స్థానం, విశిష్ట స్థానం.