ముందుగా ముంబైలో కరీనా కపూర్ కి కరోనా పాజిటివ్ సోకగా, తెలుగులో మొన్న మహేష్ బాబు, నిన్న లక్ష్మి మంచు, నేడు సంగీత దర్శకుడు థమన్ ఇలా పలువురు సినీ ప్రముఖులు దీని బారిన పడ్డారు. అయితే విషయం ఏమిటంటే టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా అందరి నుండి మంచి పేరు దక్కించుకున్న రామలక్ష్మి క్రియేషన్స్ అధినేత లగపాటి శ్రీధర్ కి కూడా నిన్న కరోనా కరోనా పాజిటివ్ రావడంతో పాటు టెస్టులు చేయించుకున్న ఆయన భార్య శిరీష సహా కుటుంబం మొత్తానికి కూడా పాజిటివ్ అని తేలిందట. దానితో వారందరూ కూడా ప్రస్తుతం ప్రత్యేకంగా హోమ్ ఐసోలేషన్ లో ఉండడంతో పాటు పక్కాగా డాక్టర్ల నుండి చికిత్స తీసుకుంటూ ఎంతో జాగ్రత్త వహిస్తున్నట్లు సమాచారం.
తెలుగులో ఎవడి గోల వాడిది, స్టైల్, పోటుగాడు, స్నేహ గీతంతో పాటు ఇటీవల అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య వంటి సినిమాలు నిర్మించారు శ్రీధర్. ఇక శ్రీధర్ ఫ్యామిలీ మొత్తానికి కరోనా సోకడంతో అతి త్వరలో వారు కోలుకోవాలని కోరుతూ పలువురు సినిమా ప్రముఖులు వారికి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పీడీ రికవరీ అంటూ మెసేజస్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ మహమ్మారి రెండు డోసులు టీకా తీసుకున్నప్పటికీ కూడా సోకుతోందని, కొందరు డెల్టా వేరియంట్ కంటే ఓమిక్రాన్ పెద్దగా ప్రమాదమైనది కాదని అంటున్నప్పటికీ, దీనిని ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దని డాక్టర్లు గట్టిగా హెచ్చరిక చేస్తున్నారు.