హీరో నాని తన తాజా చిత్రం దసరా సినిమా ఊపు మీద ఉన్నారు. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఓ ప్రక్క దసరా సినిమా ప్రమోషన్స్తో పాటు కొత్త దర్శకుడు శౌర్యు తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నాడు నాని. ఈ సినిమా షూటింగ్ మరో నాలుగు నెలల్లో పూర్తి కానుంది. అంతేకాకుండా కొత్త కథలు వింటూ తన తదుపరి ప్రాజెక్టులు ఓకే చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నాని తన తదుపరి చిత్రాన్ని వేణు శ్రీరామ్తో చేసేందుకు మొగ్గు చూపుతున్నాడని సమాచారం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ చిత్రాన్ని తెరెకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ సెట్స్పై ఉండగానే అల్లుఅర్జున్తో ఐకాన్ చిత్రాన్ని ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల బన్నీ ఈ ప్రాజెక్టు చేసేందుకు సుముఖంగా లేరట. దీంతో ఇప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కేలా కనిపించడం లేదు. దీంతో తన తదుపరి చిత్రాన్ని నానితో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే నానికి కథ చెప్పారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. నాని కూడా శ్రీరామ్ వేణుతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఇదిలా ఉంటే తనతో గతేడాది 'అంటే సుందరానికి'తీసిన వివేక్ ఆత్రేయపై మరోసారి నమ్మకం పెట్టుకున్నాడు నాని. ఆయనకు మరో ఛాన్సిస్తున్నాడని తెలుస్తుంది. డివివి దానయ్య నిర్మాణంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. 'అంటే సుందరానికి'కి ముందు ఈయన చేసిన మెంటల్ మదిలో, బ్రోచేవారెవురురా సినిమాలు మంచి విజయం సాధించాయి. దాంతో నాని సినిమాతో హ్యాట్రిక్ పక్కా అని అంతా ఫిక్సైపోయారు. అంటే సుందరానికి సినిమాకు టాక్ కూడా బాగానే వచ్చింది కానీ కలెక్షన్స్ దగ్గరికి వచ్చేసరికి సినిమా వెనకబడింది.