
ఈ సినిమా గురించి ఒక్కసారి ప్రేక్షకులు మాట్లాడుకోవడం ప్రారంభించాక, అందరి మనసులో ఒకే ప్రశ్న – “ఇంత భిన్నమైన కథకు ఐడియా దర్శకుడికి ఎలా వచ్చింది? ఈ తరహా కథను తెరకెక్కించాలనే ఆలోచన ఎలా పుట్టింది?” అనే ఆసక్తి. దీనిపై తాజాగా స్పందించిన కార్తీక్ ఘట్టమనేని గారు ఎంతో ఎమోషనల్గా తన అనుభవాన్ని పంచుకున్నారు. “మిరాయి కథను చాలా మంది ఈ రెండు మూడు సంవత్సరాల్లో డెవలప్ చేసి తీసారనుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఈ కథకు బీజం ఎనిమిదేళ్ల క్రితమే పడింది. 2015 లేదా 2016లో ఈ కథ ఆలోచన మొదలైంది. దీనికి కారణం నా అత్యంత సన్నిహిత మిత్రుడి మరణం. నా ఫ్రెండ్ చనిపోయిన తర్వాత అతని అస్తికలను కలపడానికి రామేశ్వరం వెళ్తున్నప్పుడు ఈ కథ పుట్టింది. ఆ ప్రయాణంలో గెద్ద నాతోపాటు ఉన్నట్లుగా అనిపించింది. ఆ క్షణంలోనే ఈ కథకు మొదటి రూపం దొరికింది.*” అని భావోద్వేగంతో తెలిపారు.
అలాగే ఆయన ఈ కథలోని ప్రతి సీన్ తన మనసులో పుట్టిన భావోద్వేగాల ప్రతిబింబమేనని చెప్పారు. “మీరు సినిమాలో చూసిన ప్రతి సన్నివేశం నా మనసులో వచ్చిన ఆలోచనల ప్రతిఫలమే. ఆ అనుభూతిని తెరపై చూపించాలనుకున్నాను. ఆ ఎనిమిదేళ్లలో అనేక మార్లు కథను మలచాను, మార్చాను. చివరికి ఈ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నా కష్టానికి ప్రతిఫలమూ, నా ఫ్రెండ్తో ఉన్న అనుబంధానికి నివాళి కూడా.” అని అన్నారు.
‘మిరాయి’ అనే పేరుకు సంబంధించిన అర్థం కూడా ఆయన వివరిస్తూ – “మిరాయి అనేది జపనీస్ పదం. దాని అర్థం ‘భవిష్యత్తు’ . ఈ సినిమా కాన్సెప్ట్లో కూడా అదే భావం ఉన్నందున ఈ టైటిల్ సరిపోతుందని అనిపించింది.” అని చెప్పారు. ఈ ప్రాజెక్ట్పై ఎనిమిదేళ్లపాటు నిరంతరం కృషి చేసిన కార్తీక్ ఘట్టమనేని కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు కనబడుతోందని చెప్పాలి. సినిమా అద్భుతమైన వసూళ్లను సాధించడమే కాకుండా కథ, నటన, టెక్నికల్ వర్క్ అన్నింటి పరంగా ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా వెనుక ఉన్న భావోద్వేగం, కష్టపడిన ప్రయాణం తెలుసుకున్న తర్వాత ప్రేక్షకులు మరింతగా కనెక్ట్ అవుతున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో కార్తీక్ ఘట్టమనేని ఈ మాటలు వైరల్ అవుతున్నాయి. సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, దానిలో భావోద్వేగాలు, జీవన అనుభవాలు, మనసుకు హత్తుకునే క్షణాలున్నాయని మిరాయి మరోసారి నిరూపించింది.