ప్రేమకు హద్దులు, సరిహద్దులు అడ్డురావు. మనసులు కలిస్తే జాతి, కులాలు సమస్యే లేదు. ఇందుకు తాజా ఉదాహరణ మహరాష్ట్ర అమ్మాయి, ఆంధ్ర అబ్బాయి ప్రేమ అనే ప్రపంచంలోకి ఫేస్బుక్లో ముచ్చటలాడి పరిణయమాడాలని నిర్ణయించుకున్నారు. సీతారామపురం మండలం పండ్రంగి గ్రామానికి చెందిన శింగాల నాగార్జున బీటెక్ పూర్తిచేసి నంద్యాలలో బ్యాంకు పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నాడు. ఔరంగాబాద్ (మహారాష్ట్ర)కు చెందిన పూజాచౌహాన్ బీఈ పూర్తిచేసి బ్యాంకు కోచింగ్ తీసుకుంటోంది.
వీరిద్దరూ మూడు నెలలుగా ఫేస్బుక్లో చాటింగ్ చేసుకుంటూ ప్రేమికులుగా మారారు. ప్రేమాయణం గురించి అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో మూడు రోజుల క్రితం తీవ్రంగా మందలించారు. దీంతో పూజా, నాగార్జునకు తన స్నేహితురాలి ఫోన్ నుంచి కాల్ చేసి తాను హైదరాబాద్ వస్తున్నట్లు తెలిపింది. శుక్రవారం ప్రేయసిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కలుసుకున్న నాగార్జున ఆమెను తీసుకుని నెల్లూరు ఎస్పీ వద్దకు వెళ్లి విషయం తెలిపారు. . ఎస్పీ స్పందిస్తూ ఆ ప్రేమికులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచిస్తూ ఉదయగిరి సీఐ వద్దకు పంపించారు.
సీఐ వారితో మాట్లాడగా తామిద్దరం మేజర్లమని, పెళ్లిచేసుకుంటామని స్పష్టం చేశారు. దాంతో పోలీసులు పూజాచౌహాన్ కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు హుటాహుటీన ఉదయగిరికి వచ్చారు. ఆ తర్వాత కూడా పూజ, నాగార్జుననే వివాహం చేసుకుంటానని లిఖితపూర్వకంగా తెలియజేయడంతో ఇరువురి పెళ్లికి అంగీకరించారు. ఉన్నత కుటుంబానికి చెందిన పూజ తల్లిదండ్రులు మహారాష్ట్రలోని రాజకీయ, ఉన్నత వ్యక్తుల సహకారంతో ఆమెను సొంత రాష్ట్రానికి తీసుకెళ్లే ప్రయత్నాలు జరిగాయి. ప్రేమికులిద్దరూ మేజర్లు కావడంతో వారికి రక్షణ కల్పిస్తామని సీఐ రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతారామపురం, ఉదయగిరి ఎస్సైలు ఎన్.ప్రభాకర్, శ్రీనివాసరావులు ఉన్నారు.