
మలేషియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఒకటి ఆ మధ్య మిస్సయిన సంగతి తెలిసిందే కదా. విమానం మిస్ కావడంతో దాదాపు నెలరోజులపాటు వెతికారు. ఎక్కడా ఆ విమానం జాడ దొరకలేదు. చివరకు ఎట్టకేలకు విమానం జాడ దొరికింది. అందులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు మొత్తం మరణించిన సంగతి తెలిసిందే. ఇంతటి టెక్నాలజీ, నెట్ వర్క్ అంతా ఉన్నా... విమానం ఆచూకీ అప్పట్లో కనుక్కోవడానికి నెల పట్టింది.
ఇప్పుడు అదే తరహాలో చిలికి చెందిన హెర్క్యులస్ సి 130 విమానం 38 మందితో వెళ్తూ గమ్యం చేరకుండానే అదృశ్యం అయ్యింది. చిలి వైమానిక దళానికి చెందిన ఈ కార్గో విమానంలో 17 మంది సిబ్బంది, 21 మంది ప్రయాణికులు ఉన్నారు. సోమవారం సాయంత్రం పుంటా అరెనస్ పట్టణం నుంచి అంటార్కిటికా లోని వైమానిక స్థావరానికి విమానం బయలుదేరింది. సాయంత్రం 4:55 గంటలకు బయలుదేరిన ఈ కార్గో విమానం... బయలు దేరిన గంట తరువాత అదృశ్యం అయ్యింది.
సాయంత్రం 6 గంటల తరువాత ఈ విమానం రాడార్ తో సంబంధాలు కోల్పోవడంతో చిలీ వైమానిక సిబ్బంది షాక్ అయ్యారు. వెంటనే విమానం జాడ కనుక్కోవడానికి పలురకాల చర్యలు మొదలుపెట్టారు. విమానం జాడ కోసం గాలిస్తున్న ఇప్పటి వరకు జాడ కనిపించలేదు. విమానాలు ఎలా మిస్ అవుతున్నాయో అర్ధంకాని ప్రశ్న. అవేమి చిన్న చితకా వస్తువులు కాదు. పెద్ద విమానాలు. అందులోను సి 130 విమానం అంటే పెద్ద కార్గో సైజ్ విమానం.
ఈ స్థాయిలో ఉండే విమానాలు మిస్సవ్వడం అంటూ మాములుగా జరగదు. ఈ విమానాల్లో అధునాతమైన రాడార్ వ్యవస్థ ఉంటుంది. ఇలాంటి విమానాలను సైన్యం వినియోగిస్తుంది కాబట్టి వారి అవసరాల కోసమే వీటిని వినియోగిస్తుంది. సైన్యాన్ని ఒకచోట నుంచి మరొక చోటికి తరలించడం దగ్గరి నుంచి సామాగ్రిని, ఆర్మీ వస్తువులను, అలానే డిజాస్టర్ సమయంలో ఆహార పదార్ధాల తరలింపు వంటివి కూడా ఇలాంటి విమానాల్లోనే తరలిస్తారు. ఇప్పుడు ఈ విమానం అదృశ్యం అయ్యింది అంటే ఆలోచించాల్సిన విషయమే.