ఈ మద్య దేశంలో మహిళలపై అత్యాచారాలు, లైంగి వేధింపులు బాగా పెరిగిపోతున్నాయి. దేశంలో కరోనా పెరిగిపోతుందన్న కారణంతో లాక్ డౌన్ విధించారు. ఆ సమయంలో లైంగిక వేధింపులు తగ్గాయని.. పోలీసులు అన్నారు. కానీ ఇటీవల లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి మళ్లీ అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరిగిపోతూ వస్తున్నాయి. తాజాగా పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ఉండి కామంతో రెచ్చిపోయిన ఓ డాక్టర్ కి అక్కడి నర్సులు బడితె పూజ చేసి సరైన బుద్ది చెప్పారు. .ఈ ఘటన పంచకుల సెక్టార్-6లోని సివిల్ ఆస్పత్రిలో ఈ నెల 11న రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కరోనా నేపథ్యంలో సివిల్ ఆస్పత్రిలో కొవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి డాక్టర్ జసిత్ కుమార్ విధుల్లో ఉన్నారు.
ఐసోలేషన్ వార్డులో విధులు ముగించుకున్న నర్సు.. తన గదిలోకి వెళ్లి నిద్రకు ఉపక్రమించింది. అప్పటికే రౌండ్స్ పూర్తికావడంతో.. ఆస్పత్రిలోనే డాక్టర్ మద్యం సేవించాడు. మద్యం సేవించిన తర్వాత మదమెక్కిన ఆ డాక్టర్ నర్సు ఉన్న గదిలోకి వెళ్లి ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. వెంటన అప్రమత్తమైన నర్సు కేకలు వేసింది.. అయినా ఆ డాక్టర్ ఆమెపై దూసుకు వెళ్లాడు. దాంతో అతని నుంచి తప్పించుకొని ఐసీయూలోకి పరుగెత్తితింది. పరిస్థితి గమనించి డాక్టర్ కుమార్ అక్కడ నుంచి తప్పించుకుని కారులో తన ఇంటికి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై బాధితురాలు చీఫ్ మెడికల్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేసింది.
కానీ ఉన్నతాధికారులు ఈ ఘటనను సీరియస్ గా తీసుకోలేదు. సోమవారం రాత్రి బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు డాక్టర్ కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇంత జరిగినా ఆ బుద్దిరాని డాక్టర్ మళ్లీ విధులకు హాజరు కావడానికి వచ్చాడు. అంతే కట్టలు తెంచుకున్న ఆవేశంతో నర్సులందరూ కలిసి డాక్టర్ పై దాడి చేశారు. తక్షణమే డాక్టర్ ను విధుల నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.