భారత్- చైనా మధ్య అంతటి సహృద్భావ వాతావరణం లేదన్న సంగతి తెలిసిందే. ఎప్పుడు ఛాన్స్ దొరికినా ఇండియాకు షాక్ ఇద్దామని చైనా ఎదురు చూస్తోంది. ఇప్పటికే లద్దాఖ్ సరిహద్దుల్లో తరచూ పేచీలు పెడుతోంది. అయితే భారత్‌ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. చైనాకు దీటుగా సమాధానం ఇస్తోంది. అంతే కాదు.. భవిష్యత్తులో ఎప్పుడైనా చైనాతో యుద్ధం వస్తే.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయుధ సంపత్తి పోగు చేసుకుంటోంది.

ఇందులో భాగంగానే తాజాగా కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ తీసుకున్న ఓ నిర్ణయం చైనాకు షాక్ ఇచ్చింది. అదేంటంటే.. ఏకంగా 48 వేల కోట్ల రూపాయల వ్యయంతో తేజస్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా వైమానిక దళానికి కేంద్రం కొత్త రక్తం ఎక్కిస్తోంది. దేశీయ తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌ ఎంకే1ఏ రకం కొనుగోలుకు కేబినెట్‌ కమిటీ ఆమోదముద్రవేసింది. ఈ ఒప్పందం కారణంగా  మరో 83 విమానాలు భారత్‌ అమ్ములపొదిలో చేరతాయి.

ఎల్‌సీఏ అంటే తేలికపాటి యుద్ధవిమానం.. ఇది ఈ విభాగంలో తేజస్‌ ప్రపంచంలోనే అత్యుత్తమైందన్న పేరుంది. తొలితరం తేజస్‌తో పోలిస్తే ఎంకే1ఏ రకంలో చాలా మార్పులు చేస్తారు. ఇప్పటికే వాయుసేనలో ఉన్న తేజస్‌ ఎంకే1 ఎఫ్‌వోసీకి ఇది అడ్వాన్స్ మోడల్‌ అని చెప్పొచ్చు.  దీనిలో క్వాడ్రప్లక్స్‌ డిజిటల్‌ ఫ్లైబైవైర్‌ వ్యవస్థను వినియోగించారు. విమానం బరువు తగ్గించేందుకు తయారీలో ప్రత్యేక మిశ్రమ లోహాలను వినియోగించారు. వీటి వల్ల విమానం గడువు కూడా పెరుగుతుంది.

3,500 కిలోల ఆయుధాలు మోసుకెళ్లే తేజస్ యుద్ధ విమానం 15 కిలోమీటర్ల ఎత్తు వరకూ  ప్రయాణిస్తూ దాడులు చేయగలదు. అంతే కాదు.. గాల్లోనే ఇంధనం నింపుకొనే సామర్థ్యం కూడా దీనికి ఉంది. ఇది సూపర్‌సానిక్‌ వేగంతో ప్రయాణించగలదు. అందుకే ఇప్పుడు ఈ ఒప్పందం గురించి చైనా తెగ ఆలోచిస్తోంది. ఈ ఒప్పందం కారణంగా ఇండియాకు వచ్చే ఆయుధాల గురించి ఆరా తీస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: