బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్దత్ కాషాయ జెండా కప్పుకోనున్నాడా..? ఆయన గురించి వెలువడుతున్న తాజా వార్తలు చూశాక ఈదిశగానే మున్నాభాయ్ అడుగులు పడుతున్నట్టు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోందిప్పుడు. శనివారం సంజయ్దత్ కేంద్రమంత్రి నితిన్గడ్కరీతో సమావేశమైనట్టు తెలుస్తోంది. నాగ్పూర్లోని గడ్కరీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఏం చర్చలు జరిగినదీ బయటకు రాలేదుగానీ, సంజయ్దత్ మరోసారి రాజకీయ రంగప్రవేశం చేయనున్నారని, ఆయన బీజేపీలోకి చేరే లక్ష్యంతోనే నితిన్ గడ్కరీని కలిశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే గడ్కరీతో భేటీ అనంతరం ఆయన మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్రౌత్నూ కలిశారు. నితిన్రౌత్ ఉద్ధవ్ థాకరే క్యాబినెట్లో మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన కాంగ్రెస్ నేత. మహారాష్ట్రలో ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంజయ్దత్ తండ్రి ఒకనాటి బాలీవుడ్ స్టార్ సునీల్దత్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2009లో సంజయ్దత్ సమాజ్వాది పార్టీ తరపున లోక్సభకు పోటీ చేసేందుకు ప్రయత్నించినా కోర్టులో అతడిపై ఉన్న కేసుల కారణంగా అప్పట్లో వెనక్కు తగ్గాడు.
బాలీవుడ్లో వెనుకటి తరం స్టార్ హీరో సునీల్దత్, నాటి అగ్ర కథానాయిక నర్గీస్ ల తనయుడైన సంజయ్దత్ ఇప్పటితరానికి ఓ ప్రముఖ నటుడుగా మాత్రమే తెలిసిఉండొచ్చుగాని, ఖాన్ త్రయం హవా మొదలవడానికి చాలాముందే అతడో స్టార్ హీరో. 1981లో రాకీ సినిమాతో అతడు తెరంగేట్రం చేశాడు. ఈ సినిమాకు అతడి తండ్రి సునీల్దత్ దర్శకత్వం వహించారు. నామ్, కానూన్ అప్నా అప్నా, సాజన్ ఖల్నాయక్, మున్నాభాయ్ ఎంబీబీఎస్ వంటి పలు సూపర్ హిట్ చిత్రాలు సంజయ్దత్ ఖాతాలో ఉన్నాయి. ఇప్పటికీ అతడికి పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. సంజయ్దత్ జీవితంలో సినిమా కథను మించిన మలుపులున్నాయి. చెప్పుకోదగిన విజయాలే కాదు.. చెప్పలేనంత విషాదమూ ఉంది. ఇరవై ఏళ్ల వయసులో ఉండగా.. తల్లి నర్గీస్ చనిపోవడంతో సంజయ్దత్ తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఆ తరువాత కోలుకుని హీరోగా నిలదొక్కుకున్నాక కెరీర్ ఊపందుకున్న సమయంలో అక్రమ ఆయుధాలున్నకేసులో టాడా కింద అరెస్టయ్యాడు.1996లో అనారోగ్యంతో అతడి భార్య రిచాశర్మ చనిపోయింది. జైలునుంచి విడుదలయ్యాక ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే మళ్లీ సినిమా కెరీర్ కొనసాగించాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో ప్రాధాన్యమున్న పాత్రలతో బిజీగా ఉన్నాడు.