చింతమనేని ప్రభాకర్... ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేదు. దూకుడు రాజకీయాలతో నిత్యం వార్తల్లో ఉన్న వ్యక్తి. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన చింతమనేని అక్కడి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా... చింతమనేని అంటే... మా అన్న అనేలా ఉంటారు అక్కడి ప్రజలు. 2009లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి ప్రవేశించిన చింతమనేని ప్రభాకర్... అంతటి ఎదురుగాలిలో కూడా దెందులూరు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ప్రచారం సమయంలోనే తనదైన వినూత్న శైలిలో ప్రజలను ఆకట్టుకున్నారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ నిర్వహించిన ప్రచారాన్ని స్ఫూర్తిగా తీసుకుని... కర్షకులకు అండగా ఉంటానని మాట ఇస్తూ... నియోజకవర్గంలో సైకిల్ యాత్ర నిర్వహించారు.

2009 డిసెంబర్ లో ఉవ్వెత్తున ఎగసిన సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో సుమారు 18 రోజుల పాటు నిరాహార దీక్ష నిర్వహించారు. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ లోనే సుమారు వారం రోజుల పాటు దీక్ష చేసిన చింతమనేనిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించినప్పటికీ.. మొక్కవోని పట్టుదలతో తన దీక్షను కొనసాగించారు ప్రభాకర్. ఆ తర్వాత కూడా జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. పార్టీ అధినేత చంద్రబాబు జిల్లాకు ఎన్నిసార్లు వచ్చినా ముందుగా అడిగే ప్రశ్న ఒకటే.. ప్రభాకర్ ఎక్కడా... ఎలా ఉన్నావు... అని కుశల ప్రశ్నలు తప్పనిసరి. 2014 ఎన్నికల్లో జిల్లాలో బంపర్ మెజారిటీతో విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో చింతమనేని ఒకరు. అందరూ మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. అయితే సమీకరణ కారణంగా మంత్రి పదవి దక్కనప్పటికీ.. విప్ పదవి దక్కింది చింతమనేనికి. గోదావరి జలాలు కృష్ణా నదికి తరిలించేలా పట్టిసీమ నిర్మాణం పూర్తి విషయంలో కూడా చింతమనేని పాత్ర ఉంది. కొల్లేరు లంక గ్రామాలున్న దెందులూరులో అన్నివర్గాల ప్రజలు అందుబాటులో ఉంటూ వస్తున్నారు చింతమనేని. అనూహ్యంగా 2019 ఎన్నికల్లో ఓడినప్పటికీ... ఇప్పటికీ ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై తనపై ఎన్ని కేసులు బనాయించినా కూడా... ఏ మాత్రం అధైర్య పడలేదు. అదో ఊరు, ఉత్సాహంతో కార్యకర్తల్లో జోష్ నింపుతున్నాడు. ప్రజా సమస్యలపై పోరాటానికి ఎప్పటికీ ముందు ఉంటానంటున్నారు చింతమనేని ప్రభాకర్.  

మరింత సమాచారం తెలుసుకోండి: