``మూర్ఖపు సలహా...చెత్త నిర్ణయం... ప్రజలంతా రోడ్లపై..దారులవెంట కష్టపడుతుంటే... ఇంట్లో కూర్చుంటారా? యోగా చేస్తూ... రామాయణం సీరియల్ చూస్తూ.... అంత్యాక్షరి ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటారా?``ఇవి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆయన టీం సభ్యులైన కేంద్ర మంత్రుల గురించి ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు. వివిధ సందర్భాలను ఉటంకిస్తూ మాజీ కేంద్ర మంత్రులైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఈ రేంజ్లో టార్గెట్ చేశారు.
మాజీ కేంద్ర ఆర్థికమంత్రి, కాంగ్రెస్ నేత పీ చిదంబరం కేంద్రం తీసుకున్న ఓ కీలక నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని చిన్నమొత్తాల పొదుపులపై వడ్డీరేటును తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కొన్నిసార్లు ప్రభుత్వం మూర్ఖపు సలహాలపై నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది కూడా ఓ మూర్ఖపు సలహానే. చిన్నమొత్తాలు, పీపీఎఫ్లపై వడ్డీరేటును తగ్గించటం సాంకేతికంగా సరైనదే కావచ్చు. కానీ ఈ సమయంలో కచ్చితంగా ఓ చెత్త నిర్ణయమే’ ఇది మూర్ఖులు ఇచ్చిన సలహాపై తీసుకున్న చెత్త నిర్ణయమని విమర్శించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ప్రజలు ఆదాయంకోసం తమ పొదుపులపై వచ్చే వడ్డీపై ఆధారపడుతారని తెలిపారు. గత త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి 4శాతంకంటే తక్కువగానే ఉందని, ఇప్పుడు ఆలోచించాల్సింది జీడీపీ గురించి కాదని ప్రజల ప్రాణాల గురించి అని పేర్కొన్నారు.
మాజీ న్యాయశాఖ మంత్రి అయిన కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ మరో అంశం ఆధారంగా విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా సామాన్య జనం ఇళ్లకు చేరటానికి నానాకష్టాలు పడుతుంటే ఒకరు మాత్రం ఇంట్లో కూర్చొని యోగా చేస్తూ రామాయణం సీరియల్ చూస్తూ అంత్యాక్షరి ఆడుతూ ఎంజాన్ చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ఇంట్లో యోగా చేస్తున్న వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. మరోవైపు దేశంలో చాలా ప్రాంతాల్లో వలస కార్మికులు లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి కాలి నడకన తమ సొంత ప్రాంతాలకు చేరుకొనేందుకు వందల కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. దాంతో కాంగ్రెస్ నేత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘ఇద్దరు భారతీయులు. ఒకరు యోగా చేస్తూ అంత్యాక్షరి ఆడుతున్నారు. మరొకరు ఇంటికి చేరటానికి తనను తాను రక్షించుకొనేందుకు పోరాడుతున్నారు. అతడికి ఆహారం లేదు. నిలువ నీడలేదు. బతుకుపై భరోసా ఇచ్చేవారు కూడా లేరు’ అని వ్యాఖ్యానించారు.