అగ్రరాజ్యం అమెరికాలో మనోళ్ల హవా మామూలుగా లేదు. ఉద్యోగాలు చేయడానికే కాదు, ఏకంగా అమెరికాకే ఉద్యోగాలు ఇచ్చే రేంజ్‌కు ఎదిగి, డాలర్ల సామ్రాజ్యాన్ని శాసిస్తున్నారు. వలస వెళ్లి అమెరికాలో సెటిలైన వారిలో అత్యంత సంపన్నులు ఎవరని లెక్క తీస్తే... ఆ లిస్ట్‌లో మన ఇండియన్స్‌దే టాప్ ర్యాంక్. ఇజ్రాయెల్, తైవాన్ వంటి దేశాలను సైతం వెనక్కి నెట్టి, ఏకంగా 12 మంది భారత సంతతి బిలియనీర్లు అమెరికా కుబేరుల లిస్ట్‌లో చోటు దక్కించుకుని ప్రపంచానికి షాక్ ఇస్తున్నారు.

ఈ లిస్ట్‌లో నంబర్ వన్ స్థానంలో దూసుకెళ్తోంది మరెవరో కాదు, జై చౌదరి. ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఓ సంచలనం. హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న ఊరిలో కనీస వసతులు లేని చోట పుట్టిన ఆయన, అమెరికాలో సక్సెస్‌కు కొత్త అర్థం చెప్పారు. ఓ భారతీయుడి పట్టుదల, తెలివి ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పడానికి జై చౌదరి సక్సెస్‌ స్టోరీయే అతిపెద్ద ఉదాహరణ. సైబర్ సెక్యూరిటీ సంస్థ 'జెడ్‌స్కేలర్' అధినేతగా ఆయన సంపద అక్షరాలా 1790 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు 1.49 లక్షల కోట్ల రూపాయలు.

ఇక టెక్ ప్రపంచాన్ని తమ చేతుల్లో తిప్పుతున్న గూగుల్ బాస్ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ కింగ్ సత్య నాదెళ్ల కూడా ఈ లిస్ట్‌లో తమ మార్క్ చూపించారు. వీరితో పాటు వినోద్ ఖోస్లా, రాకేష్ గంగ్వాల్, రమేష్ వాద్వానీ వంటి దిగ్గజాలు బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరి మనోళ్ల పవర్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.

ఈ రేంజ్ సక్సెస్‌కు అసలు కారణం మన భారతీయ పెంపకమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రూపాయి సంపాదిస్తే అందులో కొంత దాచుకోవాలనే మన తల్లిదండ్రులు నేర్పిన పాఠాలే వారిని ఈ రోజు ప్రపంచ కుబేరులుగా నిలబెట్టాయి. కష్టపడే తత్వం, చదువుపై శ్రద్ధ, కుటుంబ విలువలే వారిని విజయతీరాలకు చేర్చాయి.

అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు మనవాళ్లు ఓ కీలకశక్తిగా మారారు. ఈ ట్రెండ్ చూస్తుంటే, ఇండియన్ టాలెంట్ పవర్‌కు ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అనిపిస్తోంది... అసలు సినిమా ముందుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: