రాష్ట్రంలో రాబోయే నాలుగు నెలల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే హీట్‌ క్రియేట్ చేస్తున్నాయి. సాధారణంగా పంచాయతీ, వార్డు స్థాయిలో జరిగే ఈ ఎన్నికల్లో పార్టీ జెండాలు లేకపోయినా, ప్రతి అభ్యర్థి ఒక పార్టీకి మద్దతుదారుడిగానే పోటీకి దిగుతాడు. ఈసారి ముఖ్యంగా జనసేనటిడిపి కూటమి ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందనేది హాట్ టాపిక్‌గా మారింది. గ్రామీణ స్థాయిలో టిడిపి బలం ఎప్పటికీ ఎక్కువ. అయితే, జనసేన కూడా మంచి పట్టు సాధించింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా చేస్తున్న అభివృద్ధి పనులు, నిర్ణయాలు తమకు మైలేజ్ ఇస్తాయని భావిస్తున్న జనసేన వర్గాలు సొంతంగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో కూటమి కాదని, ఎవరి బలం వారికి అనే తరహాలో చీలికలు మొదలయ్యాయి.

ఇక టిడిపి వర్గాలు అయితే సూపర్ సిక్స్ హామీలతో బలంగా పోటీ చేయాలని సిద్ధమవుతున్నాయి. గ్రామీణ స్థాయిలో రాజకీయాలు ఎక్కువగా స్థానిక ఆధిపత్యం మీద ఆధారపడి ఉంటాయి. పట్టణ, నగర స్థాయిలో ఉన్నంత కలిసిమెలిసి వ్యవహారం గ్రామాల్లో ఉండదు. అందుకే అక్కడ ఎవరి పార్టీ మద్దతు వారిదే అన్నట్టుగా పోటీ తప్పదు. ఇక బీజేపీ విషయానికి వస్తే – రాష్ట్రవ్యాప్తంగా పెద్దగా బలం లేకపోయినా, మాధవ్ నేతృత్వంలో బీజేపీ కూడా ప్రయత్నం చేస్తోంది. పలు ప్రాంతాల్లో మద్దతుదారులుగా రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పోటీలో పెద్దగా ఇంపాక్ట్ చూపే పరిస్థితి లేదు.

ప్రస్తుతం జనసేన-టిడిపి కూటమి బలంగా కొనసాగుతుందా? లేక స్థానిక స్థాయిలో ఎవరి దారి వారే అనుకుంటారా? అన్నది చూడాలి. ఎందుకంటే గతంలోనూ ఇలాంటి పరిస్థితే వచ్చింది. చంద్రబాబు అధికారికంగా టిడిపి పోటీ చేయదని ప్రకటించినా, క్షేత్రస్థాయిలో నాయకులు ఆయన మాట వినకుండా నేరుగా పోటీ చేశారు. గెలిచిన చోట గెలిచారు, ఓడిన చోట ఓడారు. అదే సన్నివేశం ఇప్పుడు మళ్లీ రిపీట్ అవుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ పరిస్థితిని గ్రహించిన పవన్ కళ్యాణ్, దసరా తర్వాత జిల్లాల పర్యటనలు, గ్రామీణ పర్యటనలు పెట్టుకున్నారు. కూటమి ఐక్యతను కాపాడుతూ, తన పార్టీ వర్గాలను కంట్రోల్ చేయగలరా లేదా అనేది కీలకం. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం అభ్యర్థుల గెలుపోటములకే కాదు, కూటమి భవిష్యత్ దిశకు కూడా టెస్ట్‌గా మారనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: