స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ఇటీవల విడుదలైన చిత్రం `అల.. వైకుంఠపురములో`. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు వసూళ్ల పరంగానూ సునామీ సృష్టించింది. లాంగ్ గ్యాప్ తరువాత అల్లు అర్జున్ తెర మీద కనిపించడం, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్స్ అందించిన క్రేజీ కాంబినేషన్లో సినిమా తెరకెక్కడంతో ఈ సినిమాకు ముందు నుంచీ సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, రాధాకృష్ణ లు సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ చిత్రం ప్రీమియర్ షోల నుంచీ హిట్ టాక్ను అందుకుని.. ఎలా సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 160 కోట్ల షేర్ రాబట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్లో అయితే 3.5 మిలియన్ మార్కును అలవోకగా దాటింది.
అయితే ఈ సినిమా సక్సెస్కు సంగీతం కూడా ఓ ప్రధాన కారణం అని చెప్పాలి. ప్రఖ్యాత ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా ఆలవైకుంఠపురం ఆడియో విడుదలైంది. ఇక ఈ మ్యూజిక్ ఆల్బమ్ లో ఉన్న అన్ని పాటలకి ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ రావడమే కాకుండా తాజాగా ఈ పాటలు పాన్ ఇండియా వైడ్ ఉన్న ప్రఖ్యాత మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్ అన్నిట్లో టాప్ ప్లెస్ ట్రెండ్ అవుతుండటం విశేషం. ఈ నేపథ్యంలోనే స్పందించిన శ్రీ ఆదిత్య గుప్తా.. ఈ సూపర్ హిట్ ఆల్బమ్ను తమ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదల చేసినందుకు దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలియచేశారు.
అలాగే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. అల వైకుంఠపురములో సాంగ్స్ బాలీవుడ్ సాంగ్స్ను సైతం వెనక్కి నెట్టి జియోసావన్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ వంటి ఆల్బమ్స్ లో టాప్ ఒకటి, రెండు, ఆరు స్థానాల్లో ట్రెండ్ అవుతున్నాయి. దీంతో `అల` టీం ఫుల్ ఖుషీలో ఉన్నారు.