టాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్ నేటి ఉదయం 6 గంటల 31 నిమిషాలకు ప్రేమించిన డాక్టర్ పల్లవి వర్మను సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నాడు. నేటి హీరో నిఖిల్ తన బ్యాచిలర్ లైఫ్ కు స్వస్తి పలుకుతూ.. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. శామీర్పేట్లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో ఈ పెళ్లి వేడుక జరిగింది. లాక్ డౌన్ నిబంధనలు, కరోనా కారణంగా కొద్ది మంది బంధువులు, మిత్రులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు.
ఈ ఏడాది ఫిబ్రవరి1న గోవాలో పల్లవి వర్మతో నిశ్చితార్థం చేసుకున్న నిఖిల్ వివాహాన్ని ఏప్రిల్ 16వ తేదీన జరపాలని పెద్దలు మొదట నిశ్చయించారు. కానీ, అనుకోని విధంగా లాక్ డౌన్ వచ్చి పడడంతో వివాహం వాయిదా పడింది. అయితే ఆ పెళ్లిని తిరిగి మే 14వ తేదీని ఖరారు చేశారు. ఆ తరవాత కేసీఆర్ ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ని మే 29 వరకు పొడిగించడంతో మరోసారి పెళ్లిని వాయిదా వేయాలని అనుకున్నారు.
కానీ లాక్డౌన్ సమయం ముగిశాక అంటే వచ్చే నెల నుంచి మూఢం వస్తుంది. మంచి రోజులు లేవు. అందుకే, ఇక పెళ్లిని వాయిదా వేసుకోవడం మంచికాదనుకున్నారు నిఖిల్. ఇక దగ్గరలో ముహూర్తం లేకపోవడంతో ఫిక్స్ చేసిన ముహూర్తానికే నిఖిల్ పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ కొత్త జంటకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ప్రస్తుతం నిఖిల్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.