పన్ను ఎగవేసేందుకు విదేశాల్లో డబ్బు కూడబెట్టిన వాళ్లెంతోమందిని పనామా పేపర్స్ బయటపెట్టిన విషయం తెలిసిందే.! 140 మందికి పైగా భారతీయులు విదేశాల్లో అక్రమంగా డబ్బు కూడబెట్టారంటూ గతేడాది పనామా పేపర్స్ బయటపెట్టింది. ఆ జాబితాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నట్టు తెలిసింది. మరి అమితాబ్ పై ఐటీ సోదాలు చేస్తుందా..? మోదీ సర్కార్ చేయనిస్తుందా..? అనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్న అంశం.
పనామా పేపర్స్ లీక్ అయినప్పుడు దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలెంతో మంది వణికిపోయారు. తమ పేరు ఎక్కడ బయటికి వస్తుందోనని ఆందోళన చెందారు. అయితే ఆ తర్వాత పెద్దగా పట్టించుకోలేదు. కారణం మన ఐటీ అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడమే.! అదే సమయంలో పాకిస్తాన్ లో పనామా పేపర్స్ వల్ల ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫే గద్దె దిగాల్సి వచ్చింది. దీంతో మన అధికారులు మేల్కొన్నట్టు ఉన్నారు.
పనామా పేపర్స్ లో ఉన్నవారిపై చర్యలు తీసుకునేందుకు ఐటీ శాఖ సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. అందులో ప్రముఖంగా బిగ్ బీ పేరు వినిపించింది. దీంతో.. ఆయన్ను విచారించాలని, ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించాలని ఐటీ శాఖ యోచిస్తోందనే సమాచారం సంచలనం కలిగిస్తోంది. ఇప్పటికే పనామా పేపర్స్ లో సమాచారం వాస్తవమో కాదో నిర్ధారించుకునేందుకు ఐటీ ఉన్నతాధికారి ఒకరు బ్రిటీష్ వర్జీనియా ఐలాండ్స్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సమాచార మార్పిడికోసం భారత్ ఇప్పటికే అంతర్జాతీయ దౌత్యపరమైన లాంఛనాలను పూర్తి చేసినట్టు సమాచారం.
పాకిస్తాన్ లో పనామా పేపర్స్ పై జరిగినంత వేగంగా భారత్ లో విచారణ జరగడం లేదని.. కొంతమందిని కాపాడేందుకే మోదీ సర్కార్ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ కాస్త అలెర్ట్ అయినట్టు సమాచారం. అందుకే పనామా పేపర్స్ పై విచారణ వేగవంతం చేయాలని నిర్ణయించింది. అయితే.. బిగ్ బిను విచారిస్తారా..? ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తారా..? లాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి మోదీ సర్కార్ ఏం చేస్తుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది.